మీ అహంకారం కూలే రోజు దగ్గర్లోనే ఉంది  

తన కార్యాలయాన్ని కూల్చడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ‘‘మీ అహంకారం కూలే రోజు దగ్గర్లోనే ఉంది’’ అంటూ ముంబైలో అడుగు పెట్టీ పెట్టగానే నటి కంగనా రనౌత్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై తీవ్రంగా మండిపడ్డారు. 

‘‘నా ఇల్లు కూల్చి ఆనందపడుతున్నారు. మీ అహంకారం కూలే రోజు దగ్గర్లోనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. కశ్మీర్ పండితుల బాధేంటో నాకు ఈరోజు ఆర్థమైంది’’ అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. 

తన కార్యాలయాన్ని కూల్చుతున్న ఫొటోలను ట్విట్టర్ షేర్ చేసిన కంగనా బాబర్‌, అతని సైన్యం అంటూ కూల్చివేతకు వచ్చిన సిబ్బందిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. 

నిబంధనలకు విరుద్ధంగా భవనాన్ని నిర్మించారని బీఎంసీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి కంగనాకు నోటీసులు సైతం పంపించారు. అయితే ఆ సమయంలో కంగనా అక్కడ లేరు. ఆమె ముంబై చేరుకునే లోపే ఆమె కార్యాలయాన్ని కూల్చారు. ఆ భవనాన్ని కంగనా ఇటీవలే రూ.47 కోట్లతో కొనుగోలు చేసింది.

బుధవారం మధ్యాహ్నం భారీ భద్రత నడుమ ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టారు. ఎయిర్‌పోర్ట్‌ వెలుపల ఆమె రాకను వ్యతిరేకిస్తూ శివసేన కార్యకర్తలు పెద్దసంఖ్యలో గుమికూడగా కర్ణిసేన, ఆర్‌పీఐ కార్యకర్తలు క్వీన్‌కు మద్దతుగా భారీగా తరలివచ్చారు. 

ఇరు వర్గాలు ఎయిర్‌పోర్ట్‌ వద్ద నినాదాలతో హోరెత్తించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి కంగనా ప్రత్యేక గేట్‌ నుంచి బయటకు వెళ్లడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూలదోయడంతో ముంబైని ఆమె మరోసారి పీఓకేతో పోల్చారు. కంగనా రాకతో ఆమె నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 

 ఇక కంగనా కార్యాలయం కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. తన ఇంటిలో ఎలాంటి అక్రమ నిర్మాణం చేపట్టలేదని, కోవిడ్‌ కారణంగా సెప్టెంబర్‌ 30 వరకూ కూల్చివేతలను ప్రభుత్వం నిషేధించిందని కంగనా ట్వీట్‌ చేశారు. ఫాసిజం ఎలా ఉంటుందో బాలీవుడ్‌ ఇప్పుడు గమనిస్తోందని కంగనా బీఎంసీ చర్యపై మండిపడ్డారు.

ఇలా ఉండగా, నటి కంగనా రనౌత్‌కు చెందిన కార్యాలయాన్ని ముంబై కార్పొరేషన్ అధికారులు కూల్చివేయడం వల్ల ఆమెకు అనవసర ప్రచారం కల్పించినట్లవుతున్నదని రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపై మీడియా అతిగా కవరేజ్ చేయడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. మీడియా ఈ విషయాన్ని మరింత పెద్దదిగా చేస్తున్నదని వ్యాఖ్యానించారు. 
 
బీఎంసీ అధికారులు తమ పద్ధతిలో వ్యవహరించినప్పటికీ ప్రజల్లో తప్పుడు సందేశం వెళ్లుతున్నదని శరద్ పవార్ విచారం వ్యక్తం చేశారు. ముంబైలో అక్రమ నిర్మాణాలు కొత్త కాదని, అయితే మహారాష్ట్ర, ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో కంగనా పోల్చిన తరుణంలో ఇలాంటి చర్యలు సందేహాలు రేకెత్తించడంతోపాటు ఆమెకు అనవసర ప్రచారాన్ని కల్పిస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని సున్నితంగా మందలించారు.