కంగ‌నా ర‌నౌత్ ఆఫీసు కూల్చివేత

బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ ఆఫీసును బృహ‌న్‌ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు ఇవాళ కూల్చివేశారు.  ముంబైలోని పాలి హిల్స్‌లో ఆ ఆఫీసు ఉన్న‌ది.  బాంద్రా బంగ్లాలో అక్ర‌మంగా మార్పులు జ‌రిగిన‌ట్లు బీఎంసీ అధికారులు చెబుతున్నారు.  దానిలో భాగంగానే ఇంటికి నోటీసులు అంటించిన‌ట్లు బీఎంసీ అధికారులు చెప్పారు.  

ఇవాళ మ‌ధ్యాహ్నం 12. 30 నిమిషాల‌కు కంగ‌నా ఆఫీసుకు వెళ్లిన బీఎంసీ అధికారులు బుల్డోజ‌ర్ల‌తో ఆ బిల్డింగ్‌ కూల్చివేత ప్రారంభించారు. మ‌రో వైపు బిల్డింగ్ కూల్చివేత‌ను అడ్డుకోవాలంటూ కంగ‌నా త‌ర‌పు న్యాయ‌వాది కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

చాలా రోజులుగా స్వంత రాష్ట్రం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఉంటున్న కంగ‌నా ర‌నౌత్‌ ఇవాళ ఉద‌యం ముంబైకి బ‌య‌లుదేరింది.  చంఢీఘ‌డ్ మీదుగా ఆమె ముంబై చేరుకోనున్న‌ది. ఆమె  త‌న బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించిన ఫోటోల‌ను కంగ‌నా ట్వీట్ చేసింది. 

“నేనెప్పుడూ త‌ప్పు చెప్ప‌లేదు, నా శ‌త్రువులు నిజ‌మ‌ని ప్రూవ్ చేశారు, అందుకే ఇప్పుడు ముంబై పీవోకెగా మారింది” అంటూ త‌న ట్వీట్‌లో కంగ‌నా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి, కంగనాకు మాట‌ల యుద్ధం సాగింది. 

శివ‌సేన పార్టీతో వైరానికి దిగిన కంగ‌నా.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ముంబై పోలీసుల తీరును కూడా ఖండించింది.  శివ‌సేన తీరును త‌ప్పుప‌ట్ట‌డం వ‌ల్లే నాపై వాళ్లు క‌క్ష క‌ట్టార‌ని కంగ‌నా ఆరోపిస్తోంది. రెండు రోజ‌ల క్రితం కేంద్ర ప్ర‌భుత్వం కంగ‌నాకు వై ప్ల‌స్ భ‌ద్ర‌త‌ను క‌ల్పించింది.