జాతీయ పార్టీ పెట్టె ఆలోచన ఇప్పట్లో లేదు 

ప్రస్తుతం జాతీయ పార్టీ పెట్టె ఆలోచన ఇప్పట్లో లేదని టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు  స్పష్టం చేశారు. ఆ సమయం వచ్చినప్పుడు అందరితో చర్చించి జాతీయపార్టీ పెడతానని కెసిఆర్ చెప్పారు.

టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శాసనసభా పక్ష మాట్లాడుతూ బిజెపి, కాంగ్రెసేతర రాజకీయపక్షాలకు వ్యతిరేకంగా టిఆర్‌ఎస్ ఒక కూటమి ఏర్పాటు చేయబోతుందనే ప్రచారాన్ని నమ్మవద్దని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా అసత్య, కల్పిత కథనాలను నమ్మవద్దని చెప్పా రు. 

జాతీయ రాజకీయాల్లో పాల్గొనే సమయం వస్తే పార్టీ లో చర్చించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటానని కెసిఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిజెపి ఆరోపణలను, అసత్యప్రచారానికి స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఈ రెండుపార్టీలను టిఆర్‌ఎస్‌నాయకులు పట్టించుకోవద్దని చెప్పారు.

ఈ పార్టీలను ప్రజలు ఎప్పుడో రాష్ట్రం నుంచి పంపించారని చెబుతూ ప్రజలంతా టిఆర్‌ఎస్ వైపే ఉన్నారనడానికి అనేక ఉదాహారణలు ఉన్నాయని చెప్పారు.సాధారణ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్‌ఎస్‌దే విజయమని చెప్పారు. దుబ్బాకలో ఎప్పుడు ఉపఎన్నిక జరిగినా లక్షకు పైగా మెజారిటీ టిఆర్‌ఎస్‌కు వస్తుందని ఆయన చెప్పారు.

కాగా, భారతదేశం తెలంగాణ వైపు చూసేవిధంగా నూతన రెవెన్యూ చట్టం రూపకల్పన చేసినట్లు కేసీఆర్ వెల్లడించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే భూదందాలు, కబ్జాలు, గుండాగిరి, అవినీతి పూర్తిగా నిర్మూలిం చే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. బ్రిటీష్‌కాలం నుంచి ఉన్న రెవెన్యూ చట్టాలు నేటికి అమల్లో ఉండటంతో భూదందాలు, అవినీతి పెరిగిపోయిందని సిఎం విచారం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే నూతన రెవెన్యూ చట్టం దేశానికి ఆదర్శంగా ఉంటుందనే ధీమా వ్యక్తం చేశారు. రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టగానే రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచా కాల్చాలని సూచించారు.

శాసనసభలో ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం మంత్రుల దగ్గర సిద్ధంగా ఉండాలని, అసెంబ్లీలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని సూచించారు. ప్రతి సభ్యుడు విషయ పరిజ్ఞానంతో చర్చలో పాల్గొనేందుకు సన్నద్ధంగా ఉండాలని హితవు చెప్పారు.