ఏపీలో 5లక్షలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 8,368 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. వరుసగా 11 రోజుల పాటు 10వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. కాస్త తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,06,493కు చేరింది.
వైరస్‌ ప్రభావంతో తాజాగా 70 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 4,487కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,04,074 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 97,932 యాక్టివ్‌ కేసులున్నాయి. ఆదివారం ఒకే రోజు 58,157 టెస్టులు చేయగా, ఇప్పటి వరకు 41,66,077 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.
ఇలా ఉండగా, విజయవాడ-హైదరాబాద్‌ మధ్య ప్రయివేట్‌ బస్సులు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఆర్టీసి బస్సుల నడపడంపై తెలంగాణ ప్రభుత్వంలో చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రయివేట్‌ బస్సులకు అనుమతినిచ్చారు. పన్నులు చెల్లించి క్లియరెన్స్‌ తీసుకోవాలని ప్రయివేట్‌ బస్సు ఆపరేటర్లను ఆదేశించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులు నడపాలని ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ లాక్ – 04 మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 30 వరకు విద్యాసంస్థల బంద్‌ కానున్నాయి. సెప్టెంబర్ 21 నుండి తొమ్మిదో తరగతి, టెన్త్‌, ఇంటర్ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా, ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్లకు 21 నుండి అనుమతి ఇచ్చారు. పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.