చైనా భాషా వివక్షపై మంగోలియన్ల ఆందోళన    

సెప్టెంబర్ 1 నుండి చైనా భాషలోనే పాఠశాలల్లో విద్యాబోధన జరగాలని నిర్ణయించడం పట్ల మంగోలియా ప్రాంతంలో తీవ్ర ఆగ్రవేశాలు వ్యక్తం అవుతున్నాయి. చైనా  ప్రభుత్వ భాషా వివక్షకు నిరసనగా  మంగోలియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ మాతృభాషను కాలరాసే క్రమంలో చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.
సామూహిక పాఠశాల బహిష్కరణలు చేపడుతున్నారు. సంతకాల సేకరణ చేపట్టి మాతృభాష అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు చిన్నపాటి ఉద్యమాన్నే ప్రారంభించారు. ఉత్తర చైనా ప్రాంతంలోని ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్ లోని మంగోలియన్లపై చైనా ప్రభుత్వం కక్ష గట్టింది.
ఇక్కడ నివసించే 4.2 మిలియన్ల మంగోలియన్లు చైనా చెప్పుచేతల్లో ఉన్నారు. వీరు ఏం చేయాలన్నా చైనా ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిన అగంత్యం ఏర్పడింది. ఈక్రమంలో వారి మాతృభాషలో విద్య బోధనను వెనక్కి తీసుకునే విధంగా చైనా ప్రభుత్వం కొత్త పాఠ్యాంశాలను వాళ్లపై రుద్దేందుకు నిర్ణయించింది.
ఇన్నర్ మంగోలియా అటానమస్ రీజియన్‌లోని మైనారిటీ సమూహాలకు ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లోని మూడు సబ్జెక్టులకు మాండరిన్ చైనీస్ బోధనా మాధ్యమంగా చేపట్టాలని చైనా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే, చైనా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చర్య మంగోలియన్ భాష క్రమంగా నశించిపోవడానికి దారితీస్తుందని అక్కడి వారు భయపడుతున్నారు.
ఇప్పటికే క్షీణ దశలో ఉన్న మంగోలియన్ సంస్కృతికి తోడు ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అక్కడి వారు ఆగ్రహంతో ఉన్నారు.  ఈ వారం కరోనా వైరస్ నుంచి బయటపడి చైనా అంతటా విద్యార్థులు కొత్త విద్యా సంవత్సరానికి తరగతి గదులకు తిరిగివస్తున్న తరుణంగా ఇన్నర్ మంగోలియాలో మాత్రం తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు తిరిగి పంపించడానికి నిరాకరిస్తుండటంతో అక్కడి అనేక జాతి పాఠశాలలు బోసిపోయి కనిపిస్తున్నాయి
“మేం చైనా ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నం” అని జిలిన్ గోల్ లీగ్లో 41 ఏండ్ల పశువుల కాపరి అంగ్బా చెప్పారు. అతడి 8 ఏండ్ల కుమారుడు పాఠశాల బహిష్కరణలో పాలుపంచుకుంటున్నాడు. “మంగోలియన్ భాష చనిపోయినప్పుడు మా మంగోలియన్ జాతి కూడా కనుమరుగవుతుంది” అని ఆయన చెప్తున్న తీరు వారి మాతృభాషను కాపాడుకునేందుకు ఎంతగా తపన పడుతున్నారో అర్థమవుతుంది.
పాఠశాలల వెలుపల గుమిగూడుతున్న తల్లిదండ్రుల సమూహాలు, మంగోలియన్ పాటలు పాడుతూ.. పోలీసు అధికారులను గమనిస్తూ ఆందోళన చేస్తున్న విదేశీ మంగోలియన్లు, హక్కుల సంఘాల వీడియోలు బయటిప్రపంచానికి చేరడం లేదు. తమ మాతృభాషను రక్షించుకునేందుకు మంగోలియన్లు పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కూడా చేపట్టారు.
గురువారం నాటికి 10 కౌంటీలలోని నివాసితుల నుంచి 21 వేల మంది సంతకాలను సేకరించిన అక్కడి నాయకులు ప్రాంతీయ ప్రభుత్వ విద్యా బ్యూరోకు సమర్పించేందుకు 196 పిటిషన్లు సిద్ధం చేశారు.