ఎందుకు పనికిరాని పాస్ మార్కులు 

ఓపెన్ ఇంటర్ విద్యార్థులు పాసైనా ఉపయోగం  లేకుండా పోయింది.రాష్ట్రంలో ఈ ఏడాది తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా ఇంటర్మీడియట్ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అందరిని కేసీఆర్  ప్రభుత్వం కనీస మార్కులతో పాస్ చేసింది. అయితే ఆ మార్కులేలుమార్కులు ఇప్పుడు ఎందుకు పనికిరావడం లేదు. దానితో విద్యార్థులు కలవరం చెందుతున్నారు. 

పలు కోర్సుల్లో అడ్మిషన్లకు అడ్డంకిగా మారాయి. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, లా వంటి కోర్సుల్లో చేరాలనుకున్న విద్యార్థులకు ఈ మార్కులు ఎందుకు పనికిరావడం లేదు.  కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఓపెన్ స్కూల్ సొసైటీ, ఎన్ఐఓఎస్ కి అప్లై చేసిన విద్యార్థులు అందరినీ ప్రభుత్వం పాస్ చేసింది.

టాస్ ద్వారా ఇంటర్మీడియట్ లో 30,733 మంది, ఎన్ఐఓఎస్ లో సుమారు వెయ్యి మంది వరకు విద్యార్థులు మినిమమ్ మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు 20 వేల మంది దాకా ఉంటారు.

వీరంతా ఎంసెట్ రాసేందుకు అర్హులే. కానీ దాంట్లో క్వాలిఫై అయినా సీట్లు పొందేందుకు మాత్రం అనర్హులుగా మారారు. ప్రభుత్వం అందరినీ 35 శాతం మార్కులతో పాస్ చేసింది. దీంతో వీళ్లు ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, లా తదితర కోర్సుల్లో చేరేందుకు అవకాశం లేకుండా పోయింది.

ఆయా కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలంటే ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, మిగతా వారికి 45 శాతం మార్కులు ఉండాలి. దీంతో ఓపెన్ ఇంటర్ పాసైనా ఉపయోగం లేకుండా పోయిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఎంసెట్ కు  సుమారు రెండు వేలమంది దరఖాస్తు చేసుకున్నారు. వారంతా అర్హత సాధించినా, సీట్లు వచ్చే పరిస్థితి లేదు. లా కోర్సుల్లో చేరేందుకు నేషనల్ బార్ కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాలు మార్చాల్సి ఉంది. 

ముందుగా వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోతేనే ఫలితం ఉంటుంది. లేకుంటే సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఇప్పటికే జేఈఈ, నీట్ రాసేందుకు 75 శాతం ఇంటర్ మార్కులుండాలనే రూల్ ను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. 

కానీ క్వాలిఫయింగ్ మార్కుల అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో విద్యార్థులు  ఆందోళన చెందుతున్నారు. అన్ని కోర్సుల అడ్మిషన్లకు మార్కుల రూల్ ను ఎత్తివేయాలని కోరుతున్నారు.