ప్రైవేట్ ఆస్పత్రులు చట్టానికి అతీతమా?   

నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రైవేట్ ఆస్పత్రులు చట్టానికి అతీతమా? లేక ప్రత్యేక రక్షణలు ఉన్నాయా? అని ప్రశ్నించింది. రాయితీలు తీసుకున్న ప్రైవేట్ ఆస్పత్రులకు సేవ చేసే బాధ్యత లేదా? అని ప్రశ్నించింది. తెలంగాణలో కరోనా నివారణపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో స్పష్టత లేదని, నిర్లక్ష్యంగా ఉన్నదాన్ని రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టింది.

ప్రైవేట్ ఆస్పత్రులపై విచారణ జరపాలని జాతీయ ఫార్మా ధరల సంస్థకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈనెల 22లోగా విచారణ నివేదిక సమర్పించాలని ఎన్ పీపీ ఏకి హైకోర్టు ఆదేశాలిచ్చింది. నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పీహెచ్ డైరెక్టర్ కు సూచించింది.

ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగం పడకలు రిజర్వ్ చేస్తామన్న మంత్రి హామీ ఎందుకు అమలు కాలేదని..ప్రైవేట్ ఆస్పత్రుల్లో సగం పడకలు రిజర్వు చేస్తారా లేదా తెలపాలన్న హైకోర్టు ఒకవేళ రిజర్వ్ చేయవద్దని నిర్ణయిస్తే కారణాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.  ఈనెల 22 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలిచ్చిన హైకోర్టు విచారణ 24కు వాయిదా వేసింది.  

ప్రభుత్వం కరోనా మృతులపై  వాస్తవాలు వెల్లడించలేదనిపిస్తోందన్న  హైకోర్టు కేసులు పెరుగుతున్నప్పటికీ మృతుల సంఖ్య మాత్రం 9 లేదా 10 ఉండటం అనుమానంగా ఉందని తెలిపింది. కరోనా మృతులపై వాస్తవ వివరాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 

జిల్లా స్థాయి బులిటిన్ల విడుదలపై ప్రభుత్వం, జిల్లా అధికారులు వేర్వేరుగా చెబుతున్నారని అంటూ ఆగస్టు 31 నుంచి ఈనెల 4 వరకు జిల్లా బులిటిన్లు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనాకు ముందు, తర్వాత వైద్యారోగ్య రంగానికి కేటాయించినబడ్జెట్ వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.