పట్టాలెక్కనున్న మరో వంద రైళ్లు!

కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేయగాకేంద్రం అన్‌లాక్‌ 4.0లో పలు మైట్రో సర్వీసులకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో భారతీయ రైల్వేశాఖ మరో వంద రైళ్లను నడిపేందుకు కసరత్తులు ప్రారంభించింది. అంతర్రాష్ట్ర, ఇంట్రా స్టేట్‌ సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.

ప్రస్తుతం ముఖ్యమైన స్టేషన్ల మధ్య 230 రైళ్లు నడుపుతోంది. వీటికి తోడు మరో వంద రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపింది. హోంశాఖ అనుమతి కోసం వేచి చూస్తున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. 

ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చాక సర్వీసులను ప్రారంభిస్తామని ప్రకటించింది. రాష్ట్రాల సమన్వయంతో తొలుత ప్యాసింజర్‌ రైళ్లు నడుపుతామని చెప్పింది. రద్దీ మార్గాలకు మొదట ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పింది.

పట్టణాల్లో సబర్బన్‌ రైళ్లు నడిపేందుకూ ప్రణాళికను సైతం సిద్ధం చేసినట్లు రైల్వేశాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో భారతీయ ‌ రైల్వే రైళ్లను నిలిపివేసింది. సాధారణ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌, సబర్బన్‌, ప్యాసింజర్‌ రైలు సర్వీసుల రద్దును చేసింది. పలుసార్లు సర్వీసులను రద్దు చేస్తూ వచ్చింది. 

మొదట ఆగస్టు 11 వరకు, అనంతరం సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు అన్ని సర్వీసులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్‌లాక్‌లో భాగంగా ముఖ్యమైన స్టేషన్ల మధ్య 230 ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ప్రస్తుతం అన్‌లాక్‌లో భాగంగా సడలింపులు ఇస్తుండడంతో రైల్వే అధికారులు మరో వంద సర్వీసులను నడిపేందుకు కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపింది.