ఇంటికి చేరిన కేంద్ర మంత్రి అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద‌వాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం అనారోగ్య కారణాలతో ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్ర‌‌స్తుతం ఆయ‌న కోలుకున్నార‌ని ద‌వాఖాన వర్గాలు శనివారం ప్రకటించాయి.

దీంతో ఈరోజు ఉద‌యం 7 గంట‌ల‌కు ఆయ‌న ద‌వాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఈరోజు ఉద‌యం దేశ‌ప్ర‌జ‌ల‌కు ఓనం శుభాకాంక్ష‌లు తెలుపుతూ అమిత్ షా ట్వీట్ చేశారు.

కాగా, ఈ నెల 2న అమిత్ షా కరోనా బారిన‌పడిన విష‌యం తెలిసిందే. దీంతో గుర్‌గావ్‌‌లోని మేదాంత ద‌వాఖాన‌లో చేరారు. చికిత్స అనంర‌తం కోలుకున్న ఆయ‌న ఆగస్ట్‌ 14న ఇంటికి చేరారు. అయితే ఒళ్లు నొప్పులు, నీర‌సం తగ్గకపోవడంతో ఆగస్టు 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు.

గ‌త కొన్ని ‌వారాలుగా దేశవ్యాప్తంగా ముఖ్య‌మంత్రు‌లు, కేంద్ర‌మంత్రులు, మంత్రు‌లతో స‌హా, ఆయా పార్టీల‌కు చెందిన‌ అగ్ర‌నేత‌లు క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ, హ‌ర్యానా ముఖ్య‌మంత్రి ఖ‌ట్ట‌ర్‌, మధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌తో స‌హా అగ్ర‌నాయ‌కుల‌కు క‌రోనా సోకింది.