‘సేవా సప్తాహ్’గా మోదీ పుట్టినరోజు వేడుకలు 

‘సేవా సప్తాహ్’గా ప్రధాని నరేంద్ర మోదీ జన్మ దిన వేడుకలను వచ్చే నెలలో జరపాలని బిజెపి నిర్ణయించింది. మోదీ పుట్టిన రోజు సెప్టెంబరు 17న కావడంతో సెప్టెంబరు 14 నుంచి 20 వరకు ‘సేవా సప్తాహ్’ పేరుతో కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది.

సేవా వారోత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు వివిధ కార్యక్రమాలు చేపడతారు. ఏయే కార్యక్రమాలు నిర్వహించాలో తెలియజేస్తూ ఓ సర్క్యులర్‌ను రాష్ట్ర బీజేపీ శాఖలకు ఇప్పటికే పంపించారు. మోదీ 70వ జన్మ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాల ఇతివృత్తం ‘డెబ్భై’. 

ఈ ఇతివృత్తంతో నిర్వహించవలసిన కార్యక్రమాల వివరాలను బీజేపీ కేంద్ర కార్యాలయం ఇన్‌ఛార్జి, ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ రాష్ట్ర శాఖలకు పంపించారు. ఈ కార్యక్రమాలను కోవిడ్-19 నిబంధనలకు లోబడి నిర్వహించాలి. 70 మంది కోవిడ్-19 రోగులకు ప్లాస్మా విరాళానికి ఏర్పాట్లు చేయాలి.  

ఈ సర్క్యులర్ ప్రకారం, దేశంలోని ప్రతి మండలంలోనూ 70 మంది దివ్యాంగులకు కత్రిమ అవయవాలు, ఇతర పరికరాలను పంపిణీ చేయాలి. 70 మంది అంధులకు కళ్ళజోళ్లు, 70 ఆసుపత్రుల్లో, పేదల కాలనీల్లో పండ్లు పంపిణీ చేయాలి.