బీహార్ లో ‘కమల్ కనెక్ట్’ యాప్ తో బిజెపి 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వర్చువల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవ్వాలని  భారతీయ జనతా పార్టీ వ్యూహంగా ఉంది. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక రూపొందిస్తోంది. ‘కమల్ కనెక్ట్’ అనే అప్లికేషన్‌ను పెద్దఎత్తున వినియోగించుకోనుంది. 

తక్కువ డాటా వినియోగం అయ్యేలా, ఇంటర్నెట్ వేగం చాలా తక్కువగా ఉండే మారుమూల ప్రాంతాల్లో కూడా పనిచేసేలా ఈ అప్లికేషన్‌ను డిజైన్ చేస్తున్నారు.

‘కమల్ కనెక్ట్’ అప్లికేషన్‌తో రాజకీయ నేతలు రాష్ట్రంలో తాము చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఎంత మంది ప్రజలు లబ్ధి పొందారనే వివరాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తారు. గత ఆరేళ్లలో ముఖ్యంగా బీహార్‌కు కేంద్రం చేసిన పనులను వివరించనున్నారు. 

రాష్ట్రంలో నివసించే సాధారణ ప్రజానీకం సమస్యలను కూడా ఈ అప్లికేషన్‌ ద్వారా పరిష్కారించనున్నారు. పార్టీ నేతల బహిరంగ ప్రసంగాలను సైతం ఈ కొత్త అప్లికేషన్‌లో పోస్ట్ చేస్తారు. ఈ యాప్‌‌కు సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లను అనుసంధానిస్తారు.

ఈసారి కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఓటర్లకు చేరువయ్యేందుకు డిజిటల్ ఆప్షన్లు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ భావిస్తోంది. 

అయితే, బీహార్ ప్రజలకు తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో చురుక్కా లేకపోవడం వంటివి రాజకీయ పార్టీల ముందున్న ప్రధాన సవాలుగా చెబుతున్నారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మాసాల్లో బీహార్ ఎన్నికల నిర్వహణకు ఈసీ సన్నాహాలు చేస్తోంది.