ఈ పరిస్థితుల్లో నీట్, జెఈఈ పరీక్షలు వద్దు

కరోనా కారణంగా నీట్, జెఈఈ   పరీక్షలు వాయిదా వేయాలని రాజ్యసభ సభ్యుడు సుబ్రమణియన్ స్వామి మరోసారి కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం నీట్, జేఈఈ పరీక్షలు నిర్వహించడం అతి పెద్ద తప్పిదమని ఆయన వారించారు. 

1976లో అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం చేపట్టిన నాస్‌బందీ తో ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణను పోల్చారు. ఈ కారణంగానే 1977 ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. భారతీయ ఓటర్లు నిశ్శబ్దంగా బాధను అనుభవించినప్పటికీ దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని చెబుతూ ఆయన లో ట్వీట్ చేశారు.

సుప్రీం తీర్పుతో ‌జాతీయ స్థాయి ఇంజినీరింగ్‌, మెడిక‌ల్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు జేఈఈ, నీట్‌లు కేంద్రం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి ఎన్టీఏ అడ్మిట్ కార్డులను కూడా వెబ్‌సైట్‌లో ఉంచామని, దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని శుక్రవారం సూచించింది. 

జేఈఈ మెయిన్ సెప్టెంబ‌ర్ 1 నుంచి 6 వ‌ర‌కు, నీట్ సెప్టెంబ‌ర్ 13న జ‌ర‌గ‌నుంది. అదేవిధంగా ప్ర‌తిష్టాత్మక విద్యాసంస్థ‌లైన ఐఐటీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జెఈఈ  అడ్వాన్స్‌డ్ సెప్టెంబర్‌ 27న జ‌ర‌గ‌నుంది.

కాగా, ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కోవిడ్-19 తీవ్రత ఉధృతంగా ఉన్న ఈ తరుణంలో పరీక్షల నిర్వహణ శ్రేయస్కరం కాదని ఆమె లేఖలో పేర్కొన్నారు. 

అంతేకాకుండా సెప్టెంబర్ 30 లోపు టెర్మినల్ ఎగ్జామ్స్ నిర్వహించాలని యూజీసీ జారీ చేసిన మార్గదర్శకాలపై కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో తన అభిప్రాయాన్ని ప్రధానికి స్పష్టం చేసినట్లు ఆమె గుర్తుచేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంత వరకూ పరీక్షలను వాయిదా వేయాలని ప్రధానిని మమత కోరారు. 

మరోవంక, నీట్‌ పరీక్ష రాసేందుకు ఆన్‌లైన్‌ ఆప్షన్‌ను ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసిఐ)ను కోరింది.

”జెఇఇని ఆన్‌లైన్‌లో అనుమతించినపుడు నీట్‌ను ఎందుకు అనుమతించరు? నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నిర్వహించే ఈ రెండూ ఒకే రకమైన పరీక్షలు. అటువంటపుడు వచ్చే ఏడాది నుండి ఆన్‌లైన్‌లో నిర్వహించే అవకాశాన్ని పరిశీలించండి.” అని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పేర్కొంది.