హసీనా హత్యకు ఖలీదా కుట్ర!  

బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నేత ఖలీదా జియా, ఆమె పెద్ద కుమారుడు తారెక్ రహమాన్ 2004లో ప్రస్తుత బాంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హత్యకు కుట్రచేశారా? అవునని హసీనా సంచలన ఆరోపణ చేశారు.  అవామీ లీగ్ ఢాకాలోని బంగబంధు ఎవెన్యూలో 2004 ఆగస్టు 21న ఉగ్రవాద వ్యతిరేక సభను  నిర్వహించింది. ఈ సభ జరుగుతుండగా ఉగ్రవాద దాడి జరిగింది.

ఈ దాడిలో అప్పటి మొహిలా అవామీ లీగ్ అధ్య‌క్షుడు, బంగ్లాదేశ్ మాజీ అధ్య‌క్షుడు అయిన‌ జిల్లుర్ రహమాన్ సతీమ‌ణి ఇవీతోపాటు 24 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 500 మందికిపైగా గాయపడ్డారు. శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా అప్ప‌టి దారుణ సంఘటనను గుర్తుచేసుకున్నారు.

బంగబంధు ఎవెన్యూపై జరిగిన గ్రెనేడ్ దాడిలో తనను హత్య చేయాలని ఖలీదా జియా, ఆమె పెద్ద కుమారుడు తారెక్ రహమాన్ ప్రయత్నించారని చెప్పారు. వాళ్ళ ప్రధాన లక్ష్యం తానేనని స్పష్టం చేశారు. ఆ దాడి జరగడానికి ముందు ఖలీదా జియా మాట్లాడుతూ అవామీ లీగ్ వందేండ్ల‌ వరకు అధికారంలోకిరాదని చెప్పిన విష‌యాన్ని ఆమె గుర్తు చేశారు.

హత్యలు చేయడం వాళ్ళకి అలవాటని, దేశ స్వాతంత్య్రంపై వారికి నమ్మకం లేదని ఆమె మండిపడ్డారు. విముక్తి యుద్ధం స్ఫూర్తిని వారు విశ్వసించడం లేద‌ని విమ‌ర్శించారు. అప్పటి బీఎన్‌పీ-జమాత్ ప్రభుత్వం ఉగ్రవాదులను చేరదీసిందని ఆమె  ఆరోపించారు. ఆ గ్రెనేడ్ దాడిలో తాను మరణించానని అప్ప‌టి ప్రభుత్వం భావించింద‌ని, అయితే ఆ వెంట‌నే తాను మరణించలేదన్న విష‌యం తెలిసి ఉగ్రవాదులను దేశం దాటించార‌ని షేక్ హ‌సీనా చెప్పారు.