ఎన్‌ఆర్‌ఏ ఆధారంగా ఎంపీలో ఇక ఉద్యోగాలు 

జాతీయ నియామక సంస్థ (ఎన్‌ఆర్‌ఏ) నిర్వహించే పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చే తొలి రాష్ట్రం మధ్యప్రదేశ్  కానుందని ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వెల్లడించాయిరు. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దేశవ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ఎన్‌ఆర్‌ఏ ఏర్పాటుకు ఆమోదముద్ర వేస్తూ గురువారం కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని శివరాజ్‌ చౌహాన్‌ స్వాగతించారు. 

యువతకు వారి ఎన్‌ఆర్‌ఏ స్కోర్‌ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలను అందిస్తూ దేశంలోనే మధ్యప్రదేశ్‌ అసాధారణ నిర్ణయం తీసుకున్న తొలిరాష్ట్రంగా నిలుస్తుందని ఆయన వెల్లడించారు.  ఇతర రాష్ట్రాలు సైతం తమ యువతకు ఊరట కల్పిస్తూ ఈ దిశగా సాగాలని ఆయన పిలుపు ఇచ్చారు.

మధ్యప్రదేశ్‌లో తమ రాష్ట్ర యువతకే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే హక్కు కల్పించాలని తాము నిర‍్ణయించామని చెప్పారు. పలుమార్లు పరీక్షల నిర్వహణతో ప్రయాణాలు, ఇతరత్రా వ్యయం నుంచి ఎన్‌ఆర్‌ఏ ద్వారా ఊరట లభించిందని పేర్కొన్నారు.

ఇక దేశ యువత ఎస్‌ఎస్‌బీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌ వంటి పలు పరీక్షలకు హాజరుకాకుండా కేవలం ఉమ్మడి ప్రవేశ పరీక్షకు హాజరైతే చాలని చెప్పారు. ఇది అభ్యర్ధుల సమయాన్ని ఆదా చేయడమే కాకుండా నియామక ప్రక్రియలో పారదర్శకత నెలకొనేందుకు దారితీస్తుందని కొనియాడారు.