రైతుకు సరసమైన ధరలకే ఎరువులు  

న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ (ఎన్‌బీఎస్) పథకం కింద దేశంలో ఎరువుల ఉత్పత్తి, దిగుమతుల వ్య‌యంపై రసాయన, ఎరువుల మంత్రిత్వ శాఖలోని ఫెర్టిలైజ‌ర్స్ డిపార్ట్‌మెంట్‌ సమగ్ర పరిశీలన ప్రారంభించిందని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డి.వి. సదానంద గౌడ తెలిపారు.

“డిపార్ట్మెంట్ చేప‌ట్టిన ఈ సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థ చొరవ కారణంగా.. ఎరువుల కంపెనీలు ఇప్పుడు స్వ‌చ్ఛంద‌ స్వీయ-నియంత్రణ యంత్రాంగాన్ని అవలంభిస్తున్నాయని ఆయ‌న అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో రీగాసిఫైడ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ – ఆర్ఎల్ఎన్‌జీ ధర తగ్గింపు లాభాన్ని తయారీ సంస్థలు రైతులకు ధ‌ర త‌గ్గింపు రూపంలో బ‌దిలీ చేస్తున్నాయ‌ని” గౌడ తెలిపారు.

డయామోనియం ఫాస్ఫేట్ (డీఏపీ), అమ్మోనియం సల్ఫేట్ , ఇతర పీ అండ్ కే ఎరువుల తయారీ సంస్థలు ఆర్‌ఎల్‌ఎన్‌జీని ఫీడ్‌స్టాక్‌గా ఉపయోగిస్తారు. ఆగస్టు,2019తో పోలిస్తే.. ఆగస్టు, 2020లో మెట్రిక్ ట‌న్ను డీఏపీ ధ‌ర రూ.26396 నుంచి రూ.24626 దిగివ‌చ్చింద‌ని గౌడ తెలిపారు. 

అదే విధంగా, మొత్తం 18 ఎన్‌పీకే ఎరువుల సూత్రీకరణలలో, 2019 ఆగస్టులో ఉన్న ఎంఆర్‌పీతో పోలిస్తే, 2020 ఆగస్టులో 15 సూత్రీకరణల ఎంఆర్‌పీ తగ్గింద‌ని చెప్పారు. ఎంటీ అమ్మోనియం సల్ఫేట్ ధర ఆగస్టు, 2019తో పోలిస్తే ఆగ‌స్టు, 2020 నాటికి రూ.13213 నుంచి రూ.13149 త‌గ్గింది. 

అవ‌స‌ర‌మైన సమయంలో దేశంలోని రైతుకు సరసమైన ధరలకు ఎరువుల‌ను అందించడానికి గాను ఫెర్టిలైజ‌ర్స్ శాఖ కట్టుబడి ప‌ని చేస్తున్నది.