పండుగ రోజున ఏడుగురు ఉగ్రవాదులపై గురి 

వినాయక చవితిన భారత భద్రతా దళాలు ఏడుగురు ఉగ్రవాదుల భరతం పట్టాయి.  మొదట ఢిల్లీ ప్రత్యేక దర్యాప్తు బృందంతో ఈ వేట ప్రారంభమైంది. ఐసిస్ ఉగ్రవాది అబూ యూసుఫ్ ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ధౌలా కువాన్, కరోల్ బాగ్ మధ్య ఉన్న రిడ్జ్ రోడ్ లో జరిగిన ఎదురు కాల్పుల తర్వాత ఆ ఉగ్రవాదిని అరెస్ట్ చేశామని ప్రత్యేక బృందం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెల్లడించారు. ఆ ఉగ్రవాదిని అరెస్ట్ చేసే సమయంలో ఆయన వద్ద పేలుడు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకొని, మిగితా వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

అక్రమ చొరబాటుదార్ల రూపంలో ఉన్న ఐదుగురు ఉగ్రవాదుల్ని ఏక బిగిన పంజాబ్‌లోని తర్నాతరణ్ ప్రాంతంలో మట్టుబెట్టారు. ఈ ప్రాంతం నుంచి ఐదుగురు అక్రమ చొరబాటుదార్లు భారత్‌లో కి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీన్ని గమనించి అప్రమత్తమైన సైనికులు  అక్కడికక్కడే మట్టుబెట్టారు. ఈ  ఐదుగురూ పాక్ తీవ్రవాదులేనని అధికారులు పేర్కొన్నారు.

అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించే క్రమంలో లొంగిపోవాలని బీఎస్‌ఎఫ్ జవాన్లు వారిని కోరామని అధికారులు తెలిపారు. అయినా సరే ఆ అక్రమ చొరబాటు దారులు వినకపోవడంతో వారిపై కాల్పులు ప్రారంభించామని, ఐదుగురు మరణించారని బీఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు ప్రకటించారు. వీరి దగ్గరి నుంచి ఏకె -47తో పాటు ఆయుధాలతో కూడిన బ్యాగును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

కశ్మీర్ లోని బారాముల్లాలో ఓ ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సలూసా ప్రాంతంలోని క్రీరీలో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లోనే ఉగ్రవాదిని మట్టుబెట్టారు జవాన్లు. ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉందని ఉన్నతాధికారులు ప్రకటించారు.