పినరయి విజయన్‌ సర్కార్‌పై అవిశ్వాసం 

కేరళలో పినరయి విజయన్‌ సర్కార్‌పై ఈనెల 24న అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందని ఆ పార్టీ నేత, విపక్ష నేత రమేష్‌ చెన్నితల వెల్లడించారు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్‌ చేశారు.

 కోవిడ్‌-19 పేరుతో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ తాము కేరళ సీఎం రాజీనామాకు డిమాండ్‌ చేస్తున్నామని చెప్పారు. కాగా, కేరళలో ఇటీవల వెలుగుచూసిన గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులోనూ  పినరయి విజయన్‌ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.

ఇక కోవిడ్‌-19 రోగులు, క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తుల కాల్‌ వివరాల రికార్డులను సేకరించరాదని పోలీసులను ఆదేశించాలంటూ కేరళ హైకోర్టులో రమేష్‌ చెన్నితల దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. 

కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కోసమే కోవిడ్‌-19 రోగుల టవర్‌ లొకేషన్‌ వివరాలను తాము వాడుతున్నామని కేరళ ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు రమేష్‌ చెన్నితల పిటిషన్‌ను కొట్టివేసింది. 

రాష్ట్రంలో కరోనా వైరస్‌ను వ్యాప్తి చేస్తున్న వారిని అరెస్ట్‌ చేసేందుకే పోలీసులు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ కోసం కోవిడ్‌-19 రోగుల కాల్ రికార్డులను సేకరిస్తున్నారని అంతకుముందు కేరళ సీఎం పినరయి విజయన్‌ వివరణ ఇచ్చారు.