విషమంగానే బాలు ఆరోగ్యం 

కరోనాకు చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. వెంటిలేటర్‌ ద్వారా ఆయన శ్వాస పీల్చుకుంటున్నారని, ప్రస్తుతం ఎక్మో పరికరం అమర్చి చికిత్స కొనసాగిస్తున్నామని ఆస్పత్రి వైద్యసేవల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనూరాధ భాస్కరన్‌ బుధవారం సాయంత్రం ప్రకటించారు. 

బాలు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ కావాలని కోరుకుంటూ చెన్నై నగరానికి చెందిన 30మంది హిజ్రాలు ఆస్పత్రి ఎదుట ప్రార్థనలు జరుపుతూ కంటతడి పెట్టుకున్నారు. 

కాగా, ఎస్పీబీ కోలుకోవాలని కోరుతూ సినీనటులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్‌ రహ్మాన్‌, సినీ గేయరచయిత వైరముత్తు సహా పలువురు సినీ ప్రముఖులు, కళాకారులు గురువారం సాయంత్రం 6గంటలకు సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు దర్శకుడు భారతిరాజా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.