చైనా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ లో పేటీఎం ద్వారా రూ.649 కోట్లు 

Paytm to charge transaction fee on credit card transactions

కలర్‌ ప్రెడిక్షన్‌ పేరుతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ దందా నిర్వహిస్తూ ప్రజలను మోసంచేస్తూ రూ 1107 కోట్ల మేరకు వసూలు చేసిన ఒక చైనా కంపెనీ గుట్టు రట్టు చేసిన హైదరాబాద్ సైబర్ పోలీసులు తాజాగా ఆ ఆమొత్తంలో రూ 649 కోట్లు పేటీఎం ద్వారా చైనాకు తరలించినట్లు నిర్ధారరించారు. 
 
ఒక చైనీయుడు, ముగ్గురు భారతీయులను ఈ నెల 13న సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌చేసిన విషయం తెలిసిందే. రూ.1107 కోట్లు బెట్టింగ్‌ రూపంలో వసూలు చేయగా.. రూ.110 కోట్లు చైనాకు తరలిపోయాయి. మరో రూ.30 కోట్లను అధికారులు ఫ్రీజ్‌ చేశారు. మిగతా రూ.967 కోట్లు ఎక్కడికి వెళ్లాయో ఆరా తీస్తున్నారు. హవాలా ద్వారా ఈ డబ్బు ఇతర దేశాల మీదుగా చైనాకు తరలినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారని తెలుస్తున్నది. 
 
ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు పేటీఎం నుంచి జరుగడంతో పేటీఎంకు నోటీసులు జారీచేసి, ఆయా కంపెనీలతో ఉన్న ఒప్పందాలపై సైబర్‌క్రైమ్‌ పోలీసులు వివరణ కోరారు.  పేటీఎం సౌత్‌ఇండియా హెడ్‌ ధీరజ్‌ బుధవారం సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌, దర్యాప్తు అధికారి ఎస్సై మదన్‌ ముందు హాజరై వివరణ ఇచ్చారు. 
 
పేటీఎంకు వివిధ గేట్‌ వేల ద్వారా డబ్బు పంపిస్తే వాటిని ఒక దగ్గరకు చేర్చి రెండు మూడు రోజులకొకసారి హెచ్‌ఎస్‌బీసీ ఖాతాలకు పంపించాలనే ఒప్పందం చేసుకున్నట్టు పేటీఎం అధికారులు వివరణ ఇచ్చారని తెలిసింది. తమ ద్వారా రూ.649 కోట్ల డిపాజిట్ల్లు రెండు ఖాతాల్లో జమయ్యాయని  చెప్పారని సమాచారం. దీంతోపాటు కొంత మొత్తం చెల్లింపులు కూడా చేశామని వివరించారు.
 
సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసుల ఎదుట పేటీఎం సంస్థ ప్రతినిధులు హాజరుకావడంతో, ఈడీ అధికారులు, ఆదాయం పన్ను శాఖ అధికారులు కూడా వారి నుంచి విడిగా వివరాలు సేకరించారు. 
 
కాగా పేటీఎం సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకోవడంలో చైనా కంపెనీల మతలబు ఏమిటనే ప్రశ్న తలెత్తుతున్నది. పేటీఎంలోను చైనా సంస్థ అలీబాబా కంపెనీ షేర్లు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే చైనీయులు పేటీఎంతో ఒప్పందాలు చేసుకుని ఉంటారా? అనేదానిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి.