కోవిడ్‌కేర్‌ సెంటర్ లో అగ్ని ప్రమాదం, 9 మంది మృతి

విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తొమ్మిది మంది వరకు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. 

షార్ట్‌సర్య్కూట్‌ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ హోటల్‌ను కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో 50 మంది రోగులకు చికిత్స అందిస్తోంది. 

ఈ సంఘటన పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాగా, మృతుల కుటుంబాలకు రూ 50 లక్షలు చొప్పున జగన్ పరిహారం ప్రకటించారు. 

వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఉదయం ఐదు గంటల ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకుంది. మంటలు బాగా వ్యాపించాయి. దట్టంగా పొగ కమ్మింది. భయంతో రోగుల్లో నలుగురు మొదటి అంతస్తు నుంచి దూకేశారు. దట్టంగా వ్యాపించిన పొగ కారణంగా చాలా మందికి ఉపిరి ఆడలేదు. 

స్పాట్‌లో ఏడుగురు మృత్యువాత పడగా, ఆస్పత్రిలో ఇద్దరు ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది.  ప్రమాద ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తున్నామని కలెక్టర్ ఇంతియాజ్ పేర్కొన్నారు.  

ప్రమాదం జరిగిన వెంటనే హోటల్‌ సిబ్బంది ఆప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. ఆ సిబ్బంది అతికష్టంమీద మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు అరిపోవడంతో హోటల్లో ఉన్న కరోనా రోగులను మరో హాస్పిటల్స్‌కు మార్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నయని సిపి శ్రీనివాసులు చెప్పారు. 

రమేష్ హాస్పిటల్ ప్రభుత్వ అనుమతితో ఈ హోటల్ ను కరోనా కేర్ కేంద్రంగా మార్చిన్నట్లు తెలుస్తున్నది. అయితే కేవలం 5 మంది రోగులు మాత్రమే ఉన్నట్లు చూపు 50 మంది వరకు ఉంచడం ఇప్పుడు బైట పడింది. 

స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదంపై కేంద్రమంత్రి జి కిషన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నాయని తెలిపారు.