కరోనా ముందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ కూడా సిద్ధం 

తెలంగాణకు చెందిన మరో ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ కూడా కరోనా వైరస్‌ ప్రాథమిక దశలో  నియంత్రించే ఔషధాలను విడుదల చేయడానికి సిద్ధమైంది.  ఇప్పటికే ఆర్‌ అండ్‌ డీలో పరిశోధనలు జరుగుతున్నాయని, వచ్చే నెలలో రెండు యాంటీవైరల్‌ ఔషధాలనైనా రెమిడెవిసిర్‌, ఫావిపిరావిర్‌లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్‌, సీఎఫ్‌వో సౌమెన్‌ చక్రవర్తి తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తోపాటు 127 దేశాల్లో ఈ ఔషధాలను తయారు చేయడం, అక్కడి మార్కెట్లో విక్రయించడానికి గత నెలలో గిలీడ్‌ సైన్స్‌ ఇండస్ట్రీతో నాన్‌-ఎక్స్‌క్లూజివ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు.
వీటితోపాటు టోక్యోకు చెందిన ఫ్యూజిఫిల్మ్‌ కార్పొరేషన్‌ అండ్‌ గ్లోబల్‌ రెస్పాన్స్‌తో కలిసి అవిగన్‌ ట్యాబ్లెట్ల(ఫావిపిరావిర్‌)ను తయారు చేస్తున్నది. ఈ ఔషధాలను అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఏషియన్‌ మార్కెట్లకు ఎగుమతి చేసే ఆలోచనలో సంస్థ ఉన్నదని ఆయన చెప్పారు.
ఇలా ఉండగా, కరోనా చికిత్సకు అందరికంటే ముందుగానే వ్యాక్సిన్‌ను తీసుకురానున్నట్టు ప్రకటించిన రష్యా ఆ దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నది. ఆ దేశానికి చెందిన గమేలియా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌కు ఆగస్టు 10లోపు అనుమతులనిచ్చి ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ఆ దేశ అధికారులు వెల్లడించారు. తొలుత వైరస్‌ సోకిన వైద్య సిబ్బందికి వ్యాక్సిన్‌ను అందిస్తామని, ఆ తర్వాత ప్రజలకు సరఫరా చేస్తామని తెలిపారు.