అన్‌లాక్-3  లో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత  

అన్‌లాక్-3కి సంబంధించిన తాజా మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకూ లాక్‌డౌన్ ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అయితే కంటైన్మెంట్ ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో అన్‌లాక్-3 మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం కొంత ఊరట లభించే విధంగా సడలింపులను ప్రకటించింది. 

రాత్రి వేళ్లలో ఇప్పటివరకూ విధిస్తున్న కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఆగస్ట్ 5 నుంచి యోగా సంస్థలు‌, జిమ్‌లు తెరిచేందుకు అనుమతించింది. అయితే కోవిడ్-19 వ్యాప్తి దృష్ట్యా భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. 

ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా అనుమతినిచ్చిన కేంద్రం భౌతిక దూరంతో పాటు ఇతర హెల్త్ ప్రొటోకాల్స్‌ను పాటించాలని స్పష్టం చేసింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఆగస్ట్ 31 వరకూ మూసే ఉంటాయని తెలిపింది. 

వందే భారత్ మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులకు పరిమిత సంఖ్యలో అనుమతినిస్తున్నట్లు వెల్లడించింది. అయితే దేశవ్యాప్తంగా మెట్రో రైళ్లు నడిపేందుకు, సినిమా హాల్స్‌ తెరిచేందుకు అనుమతి లేదని తెలిపింది. 

అంతేకాదు, స్విమ్మింగ్ పూల్స్‌కు, పార్కులకు, బార్లు, ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మతపరమైన సభలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ పైన పేర్కొన్న వాటిలో పరిస్థితిని అంచనా వేసి దశలవారీగా అనుమతినివ్వనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.