కోర్ట్ లో నాలుగున్నర గంటలకు పైగా అద్వానీ 

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని  ఎల్‌కే అద్వానీని లక్నో సీబీఐ కోర్టు శుక్రవారం నాలుగున్నర గంటలకు పైగా ప్రశ్నించింది. 1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. 

శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు సుమారు నాలుగున్నర గంటలకు‌పైగా సాగిన ఈ విచారణలో వందకుపైగా ప్రశ్నలను సీబీఐ ప్రత్యేక కోర్టు సంధించింది. మరోవైపు ఈ కేసులో తనపై వచ్చిన అన్ని ఆరోపణలను 92 ఏండ్ల అద్వానీ తిరస్కరించినట్లు ఆయన తరుఫు న్యాయవాది తెలిపారు. 

అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం ఆగస్టు 5న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్న తరుణంలో అద్వానీని సీబీఐ కోర్టు విచారణ జరుపడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అద్వానీ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. వీరిద్దరు సుమారు 30 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు.

ఈ కేసులో ఆరోపణలున్న బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి మురళీ మనోహర్ జోషీని కూడా సీబీఐ ప్రత్యేక  కోర్టు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. ఈ కేసుపై రోజువారీ విచారణ చేపడతున్న లక్నో సీబీఐ కోర్టు ఆగస్టు 31న తుది తీర్పు వెల్లడించనున్నది.

సీఆర్‌పీసీ సెక్షన్‌ 313 కింద ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 32 మంది తమ వాదనలను వినిపించవచ్చని న్యాయమూర్తి ఇదివరకే తెలిపారు