భారత్ లో పెట్టుబడులకు ఇదే సరైన తరుణం 

భారత్ లో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణమని ప్రధాని నరేంద్ర మోదీ  పేరొకన్నారు. ఇండియా ఐడియాస్ సమ్మిట్‌ 2020లో మాట్లాడిన ప్రధాని పెట్టుబడులకు  అవకాశాల గడ్డగా భారత్  అవతరిస్తోందని తెలిపారు.  భారత్ – అమెరికా స్నేహం గతంలో సరికొత్త ఎత్తులను తాకిందని, ఇప్పుడు ప్రపంచం మళ్లీ కోలుకోవడానికి ఈ రెండు దేశాల సహాయకారి అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 

భారత్ లో పెట్టుబడులకు ప్రస్తుతం గల అవకాశాలను ‌ అమెరికా కంపెనీలు సద్వినియోగం చేసుకోవాలని మోదీ పిలుపిచ్చారు. ఈ వర్చువల్ సమ్మిట్‌లో విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్, అమెరికా  సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో కూడా పాల్గొన్నారు.

‘గత ఆరేళ్లలో దేశాన్ని ఆర్థికంగా, సరళీకరణల విషయంలో ఎదిగేలా చాలా చర్యలు చేపట్టాం. సంస్కరణలతో  పోటీతత్వం పెరిగింది. పెరిగిన పారదర్శకత, డిజిటైజేషన్‌ విస్తరణ, ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం, నిలకడైన విధానాలతో సరళీకరణలు విజయవంతం అయ్యాయి. కొత్త అవకాశాలకు ఇవ్వాళ భారత్ చాలా పెద్ద ప్రదేశంగా మారింది’అంటి ప్రధాని వివరించారు. 

ఉదాహరణకు టెక్‌ ప్రస్తావిస్తూ దేశంలో పట్టణ  ఇంటర్‌‌నెట్ వినియోగదారుల సంఖ్యను తొలిసారిగా గ్రామీణ  ఇంటర్‌‌నెట్ వినియోగదారులు దాటారని ప్రధాని చెప్పారు. టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 

5జీ, బిగ్ డేటా అనాలిసిస్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ లాంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌కు మంచి భవిష్యత్ ఉన్నట్లు ప్రధాని తెలిపారు. భారత్ – అమెరికా సహజ భాగస్వాములని చెబుతూ భారత్ లో వాణిజ్య అవకాశాలు పెరిగాయంటే అవి నమ్మదగిన దేశంలో ఉన్నాయనే అర్థం అని మోదీ స్పష్టం చేశారు.

ఇలా ఉండగా, జీ-7 దేశాల సదస్సుకు ప్రధాని మోదీని అమెరికా ఆహ్వానించిందని ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో  తెలిపారు. భారత్‌, అమెరికాల మధ్య సంబంధాల్లో ఇది కొత్త యుగం అని ఆయన అభివర్ణించారు. భారత దేశ భద్రతకు అమెరికా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. 

బ్లూ డాట్‌ నెట్‌వర్క్‌ను మెరుగుపరిచేందుకు భారత్‌తో కలిసి అమెరికా పని చేస్తుందని చెప్పారు. అయితే బహిరంగ వాణిజ్యాన్ని భారత్‌ మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించారు.