ఉస్మానియా ఆసుపత్రి పాత భవంతికి సీల్

ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవనం పురాతన వారసత్వ కట్టడం అయినప్పటికీ అన్ని మరమతులు చేసి పునరుద్ధరించడం అసాధ్యం అన్న నిర్ణయానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం చివరికి దాని కూల్చివేతకే మొగ్గుచూపింది. ఈ మేరకు  వైద్యఆరోగ్యశాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టతనిచ్చారు. 

ఈ నేపథ్యంలో  ఉస్మానియా ఆస్పత్రి పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేసి, సీజ్‌ చేయాలని తెలంగాణ వైద్య విద్య సంచాలకుడు డాక్టర్‌  రమేశ్‌ రెడ్డి  బుధవారం అంతర్గత ఉత్తర్వులను జారీ చేశారు.  వెంటనే భవన నిర్మాణం చుట్టూ సీజ్ చేసి ప్రత్యేక సెక్యూరిటీని పెట్టాలని వైద్యశాఖ సూచించింది.

ఇదిలా ఉండగా వందకు పైగా ఏళ్ళ చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రి భవనాలు శిథిలావస్థలో ఉన్నాయి. పురాతన భవనం కావడంతో రోజురోజుకి ఆ నిర్మాణాలు కూలిపోయే దశకు చేరాయి. చిన్నపాటి వర్షం వచ్చినా బిల్డింగ్ నుంచి స్లాప్ ఉడిపడుతోంది. అంతేగాక వార్డులలోకి నీరు చేరుతోంది. 

ఇటీవల అనేక ప్రమాదాలు చోటుచేసుకోవడంతో వైద్యులు, డాక్టర్లు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత సంవత్సరం ఏకంగా కొన్ని వార్డుల్లో పెచ్చులు కూడా ఊడి పడ్డాయి. 2015లో ఆసుపత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అత్యాధునిక భవనాలు నిర్మిస్తానని హామీ ఇచ్చి, తిరిగి అటువైపు చూడనే లేదు. 

అయితే గతవారం  కురిసిన వర్షానికి వార్డులలో నీరు చేరడంతో తప్పనిసరిగా పాతభవనాన్ని కూల్చి కొత్తది కట్టాల్సిందేనని, వైద్యులు, ప్రజలు పట్టుబడుతున్నారు. దానితో ఈ విషయమై వత్తిడి పెరగడంతో సిఎం కెసిఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఉస్మానియా పాత భవనాన్ని యుద్ధప్రాతిపదికన కూల్చివేసి ట్విన్‌ టవర్స్‌ను ఏడాది కాలంలోనే పూర్తి చేయాలని భావిస్తున్నారు. 

ఇప్పటికే పాత భవనంలో  ఉన్న పేషెంట్లను వేరే భవనంకు  తరలించామని ఉస్మానియా సూపరింటెండెంట్ తెలిపారు.