ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పరీక్షా ఫలితాల పట్ల హర్షం  

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పరీక్షా ఫలితాల పట్ల భారతీయ వైద్య నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ ఆటకట్టులో ఎటువంటి ఆవిష్కరణను అయినా స్వాగతించాల్సి ఉంటుందని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధక బృందం రూపొందించిన వ్యాక్సిన్ తొలిదశ ప్రయోగాలు గణనీయ ఫలితాలను సాధించిందని తెలిపారు. 

బ్రిటన్ లో మనుషులపై జరిగిన ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ లో ఈ టీకా బాగా పని చేస్తున్నట్లు నిర్ధారణ అయిన్నట్లు ప్రకటించారు. బ్రిటన్ లో ఫేజ్ 2, యూకే, యూఎస్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాలో ఫేజ్ 3 ట్రయల్స్ జరగాల్సి ఉంది. ఈ రెండు ఫేజ్ లలోనూ టీకా విజయమైతేనే మార్కెట్లోకి విడుదలయ్యే అవకాసహం ఉంది. అన్నీ సవ్యంగా జరిగితే మరో రెండు నెలల్లోనే ఈ టీకా మార్కెట్లోకి వచ్చే అవకాశం  ఉందని నిపుణులు చెప్తున్నారు.

తుది దశ ట్రయల్స్ మరింతగా ఫలప్రదం కావాలని ఆశిస్తున్నట్లు మరికొందరు పేర్కొన్నారు. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ పరీక్షలు చాలా శాస్త్రీయంగా జరిగాయని, పూర్తిస్థాయిలో విశ్వసనీయత ఉందని అపోలో ఆసుపత్రిలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టరు సురంజిత్ ఛటర్జీ వ్యాఖ్యానించారు. 18- 55 సంవత్సరాల మధ్య వయస్కులపై పరీక్షలు నిర్వహించడం, పలు ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు జరగడం మంచి పరిణామం అని ఛటర్జీ తెలిపారు. 

ఆక్స్ఫర్డ్ వాక్సిన్ పరీక్షలు స్వాగతింపదగినవని, అయితే వ్యాక్సిన్‌లనే  ప్రజలు నమ్ముకోవడం సరికాదని, కరోనా వైరస్‌కు గురి కాకుండా తగు జాగ్రత్తలు ఎవరికి వారు తీసుకోవడమే కీలకమైన ఔషధం అవుతుందని డాక్టర్ మృణాల్ సర్కార్ స్పష్టం చేశారు. సర్కారు నోయిడాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో ఫల్మనాలజీ విభాగం అధినేతగా ఆమె పనిచేస్తున్నారు. 

ఆరోగ్యం మనచేతిలోనే ఉందని, ప్రజలు ప్రస్తుత దశలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఏ విధమైన నిర్లక్షం పనికిరాదని ఆమె హితవు చెప్పారు. అయితే వ్యాక్సిన్ రావడం మంచి పరిణామం అవుతుందని, దీనిని అంతా స్వాగతించాల్సి ఉంటుందని తెలిపారు. 

తొలిదశ పరీక్షల ఫలితాల పట్ల డాక్టర్ లాల్ పథ్ లాబ్స్ కార్యానిర్వాహక ఛైర్మన్ డాక్టర్ అరవింద్ లాల్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ప్రపంచస్ధాయిలో సాగిన పరీక్షలలో ఇది కీలకమైనదని తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ వర్శిటీ వ్యాక్సిన్ ప్రయోగాలలో భారత్ కు  చెందిన సీరం ఇనిస్టూట్ కూడా పాలుపంచుకొంటోందని, ఈ క్రమంలో ఈ వ్యాక్సిన్ భారత్‌కు కూడా బాగా ఉపయోగపడుతుందని లాల్ తెలిపారు. 

కాగా, తమ సంస్థ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్‌ డోసుల్లో 50శాతం భారత్‌కు అందిస్తామని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదార్‌ పూనావాలా వెల్లడించారు.