రావణుడి వైమానిక సాంకేతికపై శ్రీలంక ద్రుష్టి 

లంకాధీశుడైన రావ‌ణాసురుడు విమాన‌యానం చేసిన‌ట్లు చ‌రిత్ర చెబుతున్న‌ది. రావ‌ణాసురుడు గ‌గ‌న‌త‌లంలో ఎక్క‌డెక్క‌డి వెళ్లారో ఆ రూట్ల‌ను అధ్య‌య‌నం చేయడంతో పాటు, ఆయన వద్ద గల వైమానిక సాంకేతికతను తెలుసుకొనేందుకు పరిశోధనలు చేస్తున్నట్లు శ్రీలంక ప్ర‌భుత్వం వెల్లడించింది. ఆ దేశానికి చెందిన విమాన‌యాన‌శాఖ దీనిపై ప‌రిశోధ‌న చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

లంకా న‌గ‌ర ప్ర‌భువుకు సంబంధించిన స‌మాచారాన్ని త‌మ‌కు ఇవ్వాలంటూ విమాన‌యాన సంస్థ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తూ ఇటీవ‌ల ఓ ప్ర‌ట‌క‌న చేసింది.  రావ‌ణాసురుడు ప్ర‌యాణించిన ఆకాశ‌మార్గాల‌పై తాము అన్వేష‌ణ చేయ‌నున్నామ‌ని, దానికి సంబంధించిన ఎటువంటి పత్రాలు, గ్రంధాలు ఉన్నప్పటికీ  త‌మ‌కు ఈమెయిల్ ,  ఫోన్ చేయాల‌ని శ్రీలంక విమానయాన శాఖ ఆ  ప్రకటనలో కోరింది.

రావ‌ణుడి విమాన‌యానం గురించి అనేక క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్నాయ‌ని, వాటిని క్రోడీక‌రించేందుకు ఈ ప్రాజెక్టు చేప‌ట్టిన‌ట్లు ఓ అధికారి తెలిపారు. వేల సంవ‌త్స‌రాల క్రితం శ్రీలంక‌ను రావ‌ణాసురుడు ఏలిన‌ట్లు పురాణాలు చెబుతున్నాయి. రావ‌ణుడు అనేక గ‌గ‌న మార్గాల్లో విమాన ప్ర‌యాణం చేసిన‌ట్లు కూడా క‌థ‌లు ఉన్నాయి. ఆ మార్గాల‌ను తెలుసుకునేందుకు అధ్యయనం చేప‌ట్టిన‌ట్లు సివిల్ యేవియేష‌న్ అథారిటీ అధికారి ఒక‌రు చెప్పారు.

భార‌త్ నుంచి వ‌స్తున్న ప‌ర్యాట‌కుల‌కు శ్రీలంక‌లో రామాయ‌ణ సంబంధిత ప్ర‌దేశాల‌ను చూపిస్తుంటారు. రావ‌ణ చ‌క్ర‌వ‌ర్తిని సింహాలీ బౌద్దులు కీర్తిస్తారు. త‌మిళ‌నాడులోని ద్ర‌విడ పార్టీ నేత‌లు కూడా రావ‌ణాసురిడిని స్తుతిస్తుంటారు.  శ్రీలంక‌లోని సింహాలీ బౌద్ద గ్రూపు రావ‌ణ బాలాయ అన్న పేరు పెట్టుకున్న‌ది. ఇక ఆ దేశం ప్ర‌యోగించిన తొలి శాటిలైట్‌కు రావ‌ణ‌-1 అని పేరు పెట్టింది.

ఆధునిక విమానాలకు రైట్ బ్ర‌ద‌ర్స్ ఆద్యులు కానీ, లంకాధీశుడైన రావ‌ణాసురుడు మొదటగా విమానాలు న‌డిపిన‌ట్లు తాము భావిస్తామ‌ని ఆ దేశ మాజీ ర‌వాణాశాఖ మంత్రి నిర్మ‌ల్ సిరిపాల డిసిల్వా ఓ సంద‌ర్భంలో తెలిపారు. దండు మోన‌ర అన్న ఓ ఎగిరే మెషీన్‌తో రావ‌ణాసురుడు గాలిలో విహ‌రించిన‌ట్లు శ్రీలంక‌లో చెబుతుంటారు.

త‌మ దేశంలోనే కాకుండా అనేక ఇత‌ర ప్రాంతాల్లోనూ రావ‌ణాసురుడు దండు మోన‌ర విమానంలోవిహ‌రించిన‌ట్లు లంకేయులు భావిస్తుంటారు. రావణుడిని తొలి పైలట్ గా పేర్కొంటున్నారు. శ్రీలంకలో నాలుగు విమానాశ్రయాలు, ఒక విమాన కార్యశాల అప్పుడు ఉండేవని చెబుతున్నారు.

శ్రీలంక దహనాయికి ముందుగా ఆంజనేయుడు రవాణా మార్గాలను స్తంభింప చేయడం కోసం ముందుగా ఆ విమానాశ్రయాలను దహనం చేసిన్నట్లు విశ్వసిస్తున్నారు. ఎత్తైన కొండలపై, చుట్టూ పర్వతాలుండగా గల ఒక మైదాన ప్రాంతాన్ని అప్పటి రావణుడి విమానాశ్రయంగా భావిస్తున్నారు. అక్కడకు చేరుకోవాలంటే కొలంబో నుండి 9 గంటల ప్రయాణం.