సచిన్ తిరుగుబాటులో కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యం 

కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న నాయకత్వ వైఫల్యాన్ని నేడు రాజస్థాన్ లో సచిన్ పైలట్ తిరుగుబాటు ఉదంతం మరోసారి వెల్లడిస్తున్నది. కుటుంభం వారసత్వంతో కొనసాగుతున్న ఆ పార్టీలో రాజీవ్ గాంధీ సామర్ధ్యాన్ని బహిరంగంగా ప్రశ్నించే సాహసం ఎవ్వరు చేయలేరు. అందుకనే అంతా ఆయన ప్రధాన ప్రతినిధి, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ను నిందిస్తున్నారు. 

కాంగ్రెస్ పార్టీలో ఇది కీలకమైన పదవే అయినా పార్టీలో ఏమిజరుగుతుందో తెలియక తికమక పడే పరిస్థితులలో వేణుగోపాల్ ఉన్నారు. గతంలో ఆర్ కె ధావన్, అహ్మద్ పటేల్, ఎం ఎల్ ఫోతేదార్, వి జార్జ్ వంటి వారు పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూస్తూ, ఎక్కడ సంక్షోభం ఏర్పడినా అధిష్ఠానం ప్రతినిధులుగా పరిష్కారం కోసం కృషి చేస్తుండేవారు. వీరంతా గాంధీ కుటుంభం అధికార ప్రతినిధులుగా వ్యవహరించే వారు.

అయితే వేణుగోపాల్ కు గాంధీ కుటుంబంతో అంతటి  సాన్నిహిత్యం లేదు. దదాపు స్వీయ నిర్బంధంలో ఉంటున్న రాహుల్ గాంధీకి పార్టీలో ఏమి జరుగుతుందో సరైన సమాచారం ఇచ్చే సామర్ధ్యం కూడా లేదు. వాస్తవానికి సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా – ఇద్దరు రాహుల్ గాంధీకి చాల సన్నిహితులు, డిసెంబర్, 2018లో వారిద్దరిని ముఖ్యమంత్రులుగా చేయడం కోసం రాహుల్ గాంధీ తీవ్రంగా పట్టుబట్టారు. 

ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పైలట్ తో తనకు మాటలు లేవని అంటూ అశోక్ గెల్హట్ పేర్కొనడం చూస్తే 18 నెలలుగా రాహుల్ ఏమి చేస్తున్నట్లు? రాహుల్ నిర్వాకం కారణమే ప్రస్తుతం రాజస్థాన్ లో ఆ పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభానికి కారణం అని చెప్పవచ్చు. 

సోనియా గాంధీ ప్రస్తుతం నిర్వహిస్తున్న పార్టీ తాత్కాలిక అధ్యక్షత పదవి ఆగష్టు 10తో ముగుస్తుంది. ఈ లోగా రాహుల్ గాంధీకి ఆ పదవి చేపట్టాలనే డిమాండ్లను పార్టీ నేతలు చేసేటట్లు చేయాలే సంగతే వేణుగోపాల్ మరచి పోయారు. దిగ్విజయ్ సింగ్ వంటి కొద్దిమంది అవకాశవాద ఎంపీలు మాత్రమే “రాహుల్ లావో… కాంగ్రెస్ బచావో” అంటూ నినాదాలిచ్చారు.  

కాంగ్రెస్ నాయకత్వం అసమర్ధతను ఆసరాగా తీసుకొనే అశోక్ గెహ్లాట్ వంటి రాష్ట్ర నాయకులు తమ ఇష్టం వచ్చిన్నట్లు చేస్తున్నారు. గాంధీ కుటుంభంలో సన్నిహితంగా ఉంటూ రాహుల్, ప్రియాంక వంటి వారిని చిన్నప్పుడు తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన ఇంద్రజాలంను ప్రదర్శించి మచ్చిక చేసుకొనేవారు. 

కాంగ్రెస్ అధిష్ఠానంతో అందరిని మచ్చిక చేసుకొంటూ రాష్ట్రంలో జనార్దన్ సింగ్ గెహ్లాట్, హరిదేవ్ జోషి, పరస్రం మాదెర్న, సిపి జోషి, సచిన్ పైలట్ వంటి నాయకులను పోటీ రాకుండా తప్పించుకొంటూ వస్తున్నారు. 2018 ఎన్నికల అనంతరం ఏడేళ్లుగా పిసిసి అధ్యక్షుడిగా ఉంటున్న తనకే ముఖ్యమంత్రి పదవి అంటూ కూర్చున్న పైలట్ కు షాక్ ఇచ్చారు. 

స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన 13 మందిలో 11 మంది గెహ్లాట్ మనుష్యులే కావడం గమనార్హం. వారంతా తిరుగుబాటు కాంగ్రెస్ అభ్యర్థులు, సచిన్ పోరాడి సీట్ ఇప్పించిన వారిని ఓడించిన వారే. పార్టీలో అసలు ఏమి జరుగుతుందో గాంధీ కుటుంభానికి అసలు తెలుసా?