శ్రీశైలంలో దర్శనాలు బంద్

శ్రీశైల మహాక్షేత్రంలో రోజురోజుకు కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. రెండు రోజులుగా నిర్వహించిన పరీక్షల్లో తొలిసారి 13 మందితో పాటు మంగళవారం మరో 13 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది, దాంతో శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనాలు వారం రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ఈఓ కేఎస్ రామారావు ప్రకటించారు. 

ఆలయానికి చెందిన ఇద్దరు పరిచారికలు, ముగ్గురు సెక్యురిటీ సిబ్బందితో పాటు స్థానికులకు వ్యాధి లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కేవలం రెండు రోజుల్లోనే శ్రీశైల మండలంలో 32 మందికి పాజిటివ్ నమోదు కావడం పట్ల దేవస్థాన సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఆలయాన్ని వారంపాటు మూసివేశారు. 

దేవస్థానానికి చెందిన వసతి గదుల్లో ఉండే భక్తులతో పాటు నిత్యాన్నదాన సత్రాలు, ఆశ్రమాలు, మఠాల్లోని యాత్రికులను ఖాళీ చేసి వెళ్ళి పోవాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులను వారం రోజుల పాటు రావద్దని కోరారు. 

ఉభయ దేవాలయాల్లో స్వామి అమ్మవార్లకు ఏకాంతంగా నిత్య పూజలు, స్వామి అమ్మవార్ల నిత్యకైంకర్యాలు, పరోక్ష సేవలు ఎప్పటిమాదిరిగానే నిర్వహించనున్నట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.

శ్రీశైల మహాక్షేత్రంలో చాపకింద నీరులా విస్తరించి ఒక్కసారిగా బయటపడ్డ కరోనా పాజిటివ్ హోంక్యారెంటైన్ లో వున్న వారు దేవస్థాన అధికారులు వైద్య సిబ్బందితో సహకరించాలని ఈఓ కెఎస్ రామారావు కోరారు. మంగళవారం సాయంత్రం సంభంధిత అధికారులతో టెలికాన్ఫిరెన్స్ నిర్వహించిన సూచనలు చేశారు. 

కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం హోంక్యారెంటైన్ లో వున్న బాధితులు.. గత కొద్ది రోజులుగా కలిసిన వారి వివరాలను తెలియజేసి సహకరించాలన్నారు.