గాంధీ ఆసుపత్రిలోనూ కరోనా టెస్టులు జరపాలి

తెలంగాణలో కరోనా టెస్టులు, చికిత్స తీరుతెన్నులపై హైకోర్టులో విచారణ జరిగింది. గాంధీ ఆసుపత్రిలో కరోనా టెస్టులు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గాంధీ ఆసుపత్రిలోనూ కరోనా టెస్టులు జరపాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించాలని స్పష్టం చేసింది. కరోనా రోగుల నుంచి రూ.4 లక్షలకు పైగా బిల్లులు వసూలు చేసిన యశోద, కిమ్స్‌ ఆసుపత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రైవేటు ల్యాబ్‌ల్లో అన్నిరకాల పరీక్షలకూ గరిష్ఠ చార్జీలు ఖరారు చేయాలని సూచించింది. నాచారం ఇఎస్‌ఐ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు చేస్తారా? లేదా? అనే అంశంలో ఈ నెల 27 లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

ఇలా ఉండగా, గ్రేటర్ హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్న కరోనావైరస్ కేసులు ప్రజలను మాత్రమే కాకుండా అధికారులకు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.  పలు రకాల ప్రాథమిక పరిశోధనలు తరువాత కరోనావైరస్ తేలికపాటి లక్షణాలు ఉన్న వ్యక్తులు ప్రజల్లో స్వేచ్ఛగా తిరుగుతుండడం వల్లే వైరస్‌ వ్యాప్తి పెరిగిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు.

చాలా రోజులుగా జీహెచ్‌ఎంసీలో రోజుకు సగటున 1000 పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 13 రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిమితుల్లో 14959 మందికి  కరోనా వైరస్‌ సోకింది. ఈ నెలలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.

మార్చి నుంచి జూన్ వరకు జీహెచ్‌ఎంసీలో 9262 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే 13 రోజుల్లో ఇది రికార్డు స్థాయిలో 14959 కు పెరిగింది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందనడానికి ఈ సంఖ్యలే నిదర్శనం. కరోనావైరస్‌తో జీహెచ్‌ఎంసీలోని దాదాపు అన్ని ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. 

మార్చిలో జీహెచ్‌ఎంసీలో కేవలం 74 కేసులు మాత్రమే నమోదయ్యాయి. మేలో ఈ సంఖ్య 527 కు పెరిగింది. మేలో కేసులు 1000 మార్కును దాటాయి. జూన్‌లో 7654 కేసులు నమోదయ్యాయి. ఈ 13 రోజుల స్వల్ప కాలంలోనే సుమారు 14959 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.