బంగారం స్మగ్లింగ్ లో కీలక నిందితుల అరెస్ట్ 

కేరళలో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తున్న దౌత్యమార్గాల ద్వారా 30 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసిన కేసులో ఇద్దరు కీలక నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అదుపులోకి తీసుకుంది. ఇప్పటివరకు పరారీలో ఉన్న స్వప్న సురేష్‌, సందీప్‌ నాయర్‌లను ఎన్‌ఐఎ బెంగళూర్‌లో అదుపులోకి తీసుకుంది. 
 
స్వప్న సురేష్ కుటుంభం బెంగళూరులోనే నివాసం ఉంటుంది. ఫోన్ కాల్స్ ఆధారంగా వారి ఆచూకీ కనుక్కొని, బెంగళూరు పోలీసుల సహకారంతో గత రాత్రి అదుపులోకి తీసుకొని, కొచ్చికి తరలించారు. ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుండి వారిద్దరూ పరారీలో ఉన్నారు. 
 
వారిద్దరూ కేరళకు వచ్చి కోర్ట్ ముందు లొంగిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తేలింసింది. ఇలా ఉండగా, కస్టమ్స్ అధికారులు కొచ్చిలోని సందీప్ ఇంటిపై దాడులు జరుపుతున్నారు. ఎన్‌ఐఎ బృందం కూడా వారితో చేరింది. 
 
మరో నిందితుడు సరిత్‌ను ఇప్పటికే కస్టమ్స్‌ శాఖ అరెస్ట్‌ చేసింది. శుక్రవారం నాడు చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణా చట్టం కింద ఎన్‌ఐఎ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ కేసులో అంతర్జాతీయ లింకులు కూడా ఉన్నందున తాము దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.