యూపీలో నేరస్థులపై యోగి సర్కార్‌ ఉక్కుపాదం  

పోలీసులపైననే కాల్పులు జరిపి, ఎనిమిది మందిని హతమార్చిన కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌దూబే పోలీసుల చేతిలో హతం కావడం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.  ఉత్తర్‌ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నేరస్తులపట్ల అనుసరిస్తున్న కఠిన వైఖరిని మరోమారు వెల్లడించింది.
ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చేనాటికి ఉత్తర ప్రదేశ్ దేశంలోనే రాజకీయాల ప్రోత్సాహంతో నేరస్థులు స్వైరవిహారం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ  వత్తిడుల కారణంగా నేరస్థుల పట్ల పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమే లేదా వారితో కుమ్మక్కు కావడమో చేస్తూ వచ్చారు. నేరమయ రాజకీయాలకు ఉత్తరప్రదేశ్‌ అడ్డాగా మారింది. 
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాటలలో చెప్పాలి అంటే “ఈ రాష్ట్రాన్ని ఎవ్వరు కాపాడతారు?” అంటూ ప్రజలు ఒక విధంగా నిస్పృహకు గురయ్యారు. అయితే ఈ పరిస్థితులను ఆదిత్యనాథ్ ఒక సవాల్ గాతీసుకున్నారు.  నేరస్థుల ఏరివేతకు ‘తోకో పాలసీ’ పేరుతో ఆయన ఏకంగా ఒక విధానాన్నే తీసుకొచ్చారు.
2019 డిసెంబర్‌లో స్వయంగా యూపీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం యోగి ప్రభుత్వం అనుసరిస్తున్న తోకో పాలసీ నేరస్థులను హడలెత్తిస్తున్నది.  బయట ఉండడం కంటే జైల్లో ఉండడమే  సురక్షితమని భావించి ఏకంగా 17 వేల మందికిపైగా తమ బెయిల్‌ను రద్దు చేసుకొని జైళ్లకు తిరిగి వెళ్లిపోయారు.
2017లో మార్చి 26న ముఖ్యమంత్రిగా యోగి బాధ్యతలు చేపట్టిన నెలలోపే ఆయన నేరస్థులకు స్పష్టమైన  హెచ్చరిక చేశారు. ‘అగర్‌ అపరాధ్‌ కరేంగేతో తోక్‌ దియే జాయేంగే’. (ఎవరైనా నేరానికి పాల్పడితే.. వారు ఖతమవుతారు).
నేరస్థులు ఉంటె జైళ్లలో ఉండాలి లేదా ఎన్‌కౌంటర్ కు గురికావాల్సిందే’ అన్నది అక్కడి ప్రభుత్వ విధానంగా మారినదని వాదనలు చెలరేగాయి. 
అంతేగాక ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీస్‌ బృందానికి రూ.లక్ష నగదును ఇస్తామని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. 16 నెలల కాలంలో  రాష్ట్రంలో 3200కుపైగా ఎన్‌కౌంటర్లు జరుగగా, 79 మంది నేరగాళ్లు ప్రాణాలు కోల్పోయారు.