కాశ్మీర్ లో బిజెపి నేత, తండ్రి, సోదరుడి కాల్చివేత 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు  షేక్‌ వాసింతోపాటు ఆయన తండ్రి, సోదరుడు చనిపోయారు. బందిపోర్‌లో స్థానిక పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని తమ దుకాణంలో షేక్‌ వాసిం తన తండ్రి బషీర్‌ అహ్మద్‌, సోదరుడు ఉమర్‌ బషీర్‌ కూర్చొని ఉండగా వారిపై బుధవారం రాత్రి ఉగ్రవాదులు దాడిచేశారు. 

వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే వారిని జిల్లా దవాఖానకు తరలించగా, అప్పటికే వారు మరణించినట్లు వెల్లడించారు. ముగ్గురిని తలపై కాల్చారని వైద్యులు తెలిపారు.  

ఈ ఘటనను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్రంగా ఖండించారు. వాసిం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ ట్వీట్‌ చేశారు. 

కాగా, షేక్‌ వాసింకు 8 మంది భద్రతా సిబ్బంది ఉండగా, ఉగ్రదాడి సమయంలో ఒక్కరూ లేకపోవడం గమనార్హం. భద్రతా సిబ్బందిని అరెస్ట్‌ చేసి, విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

ఈ దుర్ఘటన పట్ల బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది బిజెపికి భారీ నష్టం కలిగిస్తుందని చెప్పారు. మృతుల కుటుంభం సంభ్యులకు  సంతాపం తెలిపారు. మొత్తం పార్టీ వారి కుటుంభంకు బాసటగా నిలబడుతుందని తెలుపుతూ వారి బలిదానం వృద్ధకాబోదని విశ్వాసం వ్యక్తం చేశారు. 

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్  అబ్దుల్లా సహితం ఈ సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటన పట్ల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. 8 మంది భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ కాల్పులకు గురికావడం విస్మయం వ్యక్తం చేశారు. షైక్ వాసిం తండ్రి కూడా సీనియర్ బిజెపి నేత అని చెప్పారు.