బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోకు కరోనా 

బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కోవిడ్-19 బారిన పడ్డారు. తాజాగా చేసుకున్న పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనికి ముందు ఆయన రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే రెండు పరీక్షల్లోనూ నిగిటివ్‌నే అని తేలింది. 
 
ప్రస్తుతం చేసుకున్నది మూడవసారి. ఆసుపత్రినుంచి తిరిగి వచ్చిన అనంతరం ఆయన బ్రెసిలియాలోని ప్యాలెస్ లో తన మద్దతుదారులతో మాట్లాడారు.  ప్రస్తుతానికి అంతా బాగానే ఉందని వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. 
 
కరోనా విషయంలో బ్రెజిల్ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది. అమెరికా తర్వాత అత్యధిక కేసులు బ్రెజిల్‌లోనే ఉన్నాయి. ఇప్పటి వరకు 16 లక్షలకు పైగా కేసులు బ్రెజిల్‌లో నమోదు అయ్యాయి. 
 
 ఇక కరోనా టెస్టుల గురించి, మాస్కు ధరించడం గురించి ఈయన చుట్టూ పెద్ద వివాదమేనడించింది. దేశాధినేతైనా సరే మాస్క్ ధరించాల్సిందేనన్న బ్రెజిల్ కోర్టు వ్యాఖ్యలను ఆయన అర్థం లేనివిగా కొట్టి పారేశారు. ఇక కరోనా టెస్టు తరుచూ చేసుకోవడం వల్ల తన ఊపిరితిత్తులు శుభ్రపడుతున్నాయని పేర్కొన్నారు. 
 
మార్చిలో ఫ్లోరిడాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయిన ప్రతినిధి బృందంలో చాలా మంది సభ్యులు వైరస్ బారిన  పడటంతో బోల్సోనారోకు  నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో మూడుసార్లు నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. బ్రెజిల్‌లో కరోనా శరవేగంగా విస్తరిస్తూ మరణమృదంగం మోగిస్తున్నా లాక్ డౌన్ ప్రకటించేందుకు ససేమిరా అన్న బోల్సోనారో  వివాదానికి తెరతీశారు.
 
అయితే జైర్ బోల్సోనారో తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బ్రెజిల్‌లోని సావోపాలో గవర్నర్ జాయ్ డోరియా మాట్లాడుతూ బ్రెజిల్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నా అధ్యక్షుడికి ఏమాత్రం పట్టింపు లేదని, కరోనా కంటే బోల్సనారో వైరస్ అత్యంత ప్రమాదకరం అంటూ విమర్శలు గుప్పించారు.