ఇద్దరు హిజ్‌బుల్‌ ఉగ్రవాదుల హతం  

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ముమ్మరంగా కొనసాగుతున్నది. గత నెలరోజులుగా ప్రతిరోజు జమ్ముకశ్మీర్‌లోని ఏదో ఒక ప్రాంతంలో ఎన్‌కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. 
 
తాజాగా శనివారం అర్ధరాత్రి కల్గామ్‌ జిల్లాలో ఇద్దరు హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్‌ గాయపడ్డారు. 
 
ఉగ్రవాదులున్నారనే సమాచారంతో దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో ఉన్న అర్రాహ్‌ ప్రాంతంలో శనివారం రాత్రి భద్రతా దళాలు కార్డన్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ సందర్భంగా మిలిటెంట్లును లొంగిపోవాలని కోరామని, స్థానిక నాయకులు కూడా వారికి లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారని పోలీసులు తెలిపారు. 
 
అయినా వారు వినకుండా భద్రతా బలగాలపై కాల్పులు జరిపారని, ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారని వెల్లడించారు. మృతుల్లో ఒకరు విదేశీయుడని, అతన్ని అలీ భాయ్‌ అలియాస్‌ హైదర్‌గా గుర్తించామని పేర్కొన్నారు. 
 
కాగా,  రెండో మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉన్నదని చెప్పారు. వారు హిజ్‌బుల్‌ ముజాహిదీన్‌ సంస్థకు చెందినవారని వెల్లడించారు. గాయపడిన జవాన్‌ను హాస్పిటల్‌కు తరలించామని తెలిపారు.