రాహుల్  ప్రశ్నలు వేసే హక్కు కోల్పోయారు

‘మెహుల్ చోక్సీ గురించి పెడబొబ్బలు పెడుతున్న మీరు, ప్రశ్నలు వేసే హక్కు కూడా కోల్పోయారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఎద్దేవా చేశారు . ఆర్‌జీఎఫ్ నుంచి మెహుల్ చోక్సీ డబ్బులు ఎందుకు తీసుకున్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నానని నిలదీశారు. మెహుల్ చోక్సీకి కాంగ్రెస్ రుణం (లోన్) ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. 

చైనా చొరబాట్లపై ప్రధాని మోదీ వాస్తవాలు వెల్లడించాలంటూ కాంగ్రెస్ డిమాండ్‌ చేయడాన్ని కొట్టిపారవేస్తూ 1991 కేంద్ర బడ్జెట్‌లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ (ఆర్‌జీఎఫ్)కు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రూ.100 కోట్లు కేటాయించారని, ఆర్‌జీఎఫ్ అకౌంట్ల ఆడిట్‌ కాగ్‌కు అప్పగించేందుకు నిరాకరించారని గుర్తు చేశారు. 

‘జవహర్ భవన్ నిర్మాణం జరిగిన అత్యంత విలువైన స్థలాన్ని ఆర్‌జీఎఫ్‌కు శాశ్వత లీజ్‌కు ఎందుకు ఇచ్చారో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. శాశ్వత లీజ్ కోసం అంత ఖరీదైన స్థలాన్ని ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి?’ అని నడ్డా ప్రశ్నించారు. 

1991 బడ్జెట్‌లో రూ.100 కోట్లను ఆర్జీఎఫ్‌కు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇచ్చారని, ఆర్‌జీఎఫ్ అకౌండ్ల ఆడిట్‌కు కాగ్‌కు అప్పగించేందుకు ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు. అది ఆర్డీఐ పరిధిలోకి కూడా రాదని పేర్కొంటూ ప్రజాధనం ఎందుకు లూటీ చేశారో చెప్పాలని నడ్డా డిమాండ్ చేశారు.

 ‘ఆర్‌జీఎఫ్ డబ్బులు తీసుకోవడమే కాదు, స్కాములూ ఉన్నాయి. ప్రమాదకరమైన డొనేషన్లూ ఉన్నాయి. ఒక కుటుంభం నియంత్రణలో ఉన్న రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టుకు నిధులు ఎలా డొనేట్ చేశారు’ అని నడ్డా ప్రశ్నించారు.

‘2005 నుంచి 2009 వరకూ చైనా ఎంబసీ నుంచి రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు నిధులు వచ్చాయి. పన్ను ఎగవేతదారుల స్వర్గధామమైన లక్సెంబర్గ్ నుంచి 2006-2009 మధ్య ప్రతి ఏడాది విరాళాలు  అందుకుంది. ఇది దేనిని సూచిస్తోంది?. ఎన్జీవోలు, కంపెనీలు లోతైన వాణిజ్య ప్రయోజనాలతోనే ఫౌండేషన్‌కు డబ్బులు విరాళం ఇచ్చారు’ అని ఆయన ఆరోపించారు. 

రాజీవ్ గాంధీ పౌండేషన్‌కూ, చైనా ప్రభుత్వానికి మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉందో బయటపెట్టాలని నడ్డా డిమాండ్ చేశారు.

ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ) రైతుల ప్రయోజనాలకు కానీ, ఎంఎస్ఎంఈ రంగం, లేదా వ్యవసాయ ప్రయోజనాలకు కానీ ఉద్దేశించినది కాదని, అందుకే ప్రధాని మోదీ అందులో చేరలేదని నడ్డా  స్పష్టం చేశారు. 

అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్‌సీఈపీలో భాగస్వామ్య మైందని చెప్పారు. ‘ఆర్‌సీఈపీలో చేరాల్సిన అవసరం ఏమొచ్చింది? చైనాతో భారత దేశ వాణిజ్య లోటు 1.1 బిలియన్ డాలర్ల నుంచి 36.3 బిలియన్ డాలర్లకు ఎందుకు పెరిగింది? ఇది క్విడ్ ప్రోకా (ఇచ్చిపుచ్చుకోవడం) కాదా?’ అని నడ్డా ప్రశ్నించారు.

కరోనా పేరుతోనే, చైనాతో పరిస్థితుల పేరుతోనే అసలు వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం సోనియా గాంధీ చేయరాదని నడ్డా హితవు చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశాన్ని, సరిహద్దులను కాపాడగలిగే సత్తా భారత ఆర్మీకి ఉందని నడ్డా స్పష్టం చేశారు.