హోం క్వారంటైన్ లోకి హరీష్ రావు 

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి టి  హరీశ్‌ రావు హోం క్వారంటైన్లోకి వెళ్లారు. వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో ఆయన ముందు జాగ్రత్తగా వెళ్లిన్నట్లు తెలుస్తున్నది.  మంత్రి మంత్రి పిఎకు కరోనా సోకడంతో ఆయనతో కాంటాక్ట్‌ అయిన 51 మంది నమూనాలను సేకరించారు.

వీరిలో 17 మందికి నెగటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. మిగతా వారి రిపోర్టులు నేడు వచ్చే అవకాశం ఉంది. పిఎను కలిసి ఇప్పటికే ఐదు రోజులు అయినప్పటికీ ముందు జాగ్రత్తగా తాను వారం రోజులపాటు క్వారంటైన్లో ఉంటానని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పనులు చక్కబెడతానని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

ఇప్పటికే సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌ కూడా సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్న ఉన్నారు. యాదాద్రి జిల్లా కలెక్టర్‌ కూడా హోం క్వారంటైన్లో ఉన్నారు. జిహెచ్‌ఎంసి మేయర్‌ బొంతు రామ్మోహన్‌ డ్రైవర్‌కు కరోనా సోకడంతో శుక్రవారం మేయర్‌ కూడా కోవిడ్‌ టెస్టులు చేయించుకున్నారు. అంతకు ముందు కూడా ఓసారి మేయర్‌ కరోనా టెస్టులు చేయించుకోగా నెగటివ్‌ అని రిపోర్ట్‌ వచ్చింది. 

ఇంతకు ముందు ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే, బిజెపి సీనియర్‌ నేత చింతల రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కోవిడ్‌ బారిన పడగా చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఓ రాజకీయ నాయకుడికి కూడా కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు సమాచారం.

తాజాగా అధికార పార్టీకే చెందిన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. గత రెండు రోజులుగా ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా సోకిన తొలి ఎమ్మెల్యే ఈయనే కావడం గమనార్హం.