-0.38 శాతానికి పాక్ ఆర్ధిక వ్యవస్థ పతనం  

కరోనా నేపథ్యంలో పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమైంది. 68 ఏండ్లలో తొలిసారి -0.38 శాతానికి దిగజారింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వేను ఆ దేశ ఆర్థిక వ్యవహారాల సలహాదారుడు అబ్దుల్‌ హఫీజ్‌ షేక్‌ శుక్రవారం విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో మార్చి నుంచి విధించిన లాక్‌డౌన్‌ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని ఆయన చెప్పారు. 

ఒక్క వ్యవసాయం రంగం వృద్ధి మాత్రమే 2.7 శాతం పెరిగిందని, పారిశ్రామిక, సేవల రంగాలు నెగిటివ్‌ వృద్ధిని నమోదు చేశాయని తెలిపారు. డాలర్‌తో పోల్చిస్తే తలసరి ఆదాయం 6.1 శాతం తగ్గి 1,366గా ఉందని పేర్కొన్నారు. రూపాయితో పోల్చితే ఇది రూ.2,14,539కి పెరిగిందని తెలిపారు. అయితే పన్నుల వసూళ్లు మాత్రం గతంతో పోల్చితే 10.8 శాతం పెరిగి రూ.3,300.6 బిలియన్లకు చేరినట్లు చెప్పారు.

దేశ ఆర్థిక లోటు 73.1 శాతానికి తగ్గిందని అబ్దుల్‌ హఫీజ్ తెలిపారు. గత ఏడాది జీడీపీలో 3.7 శాతంగా ఉన్న 10.3 బిలియన్‌ అమెరికా డాలర్లు ఆర్థిక లోటు ఈసారి 2.8 బిలియన్లకు చేరిందని, దేశ జీడీపీలో ఇది 1.1 శాతమని పేర్కొన్నారు. అయితే ఆర్థిక లోటును గణనీయంగా తగ్గించ గలిగామని, దేశ చరిత్రలో తొలిసారి ఆదాయం కంటే ఖర్చులు తక్కువగా ఉండటంతో ఆ మేరకు మిగులు నిధులు సాధించినట్లు హఫీజ్‌ తెలిపారు. 

మరోవైపు దేశ బాహ్య రుణాలు 76.5 బిలియన్‌ అమెరికా డాలర్లకు చేరాయని ఆర్థిక వ్యవహారాల మంత్రి ఖుస్రు బఖ్తియార్ ఆందోళన వ్యక్తం చేశారు. 2013లో 40 బిలియన్‌ అమెరికా డాలర్లుగా ఉన్న ఈ రుణాలు పీపీపీ హయాంలో 48 బిలియన్లకు, ఐదేండ్ల నవాజ్‌ షరీఫ్‌ పాలనలో 73 బిలియన్ల అమెరికా డాలర్లకు పెరిగాయని ఆరోపించారు. ప్రతి ఏటా పాక్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు ఆర్థిక సర్వేను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తున్నది.