చర్చలంటూనే సరిహద్దుల్లో భారీగా చైనా బలగాలు  

సరిహద్దుల్లో పరిస్థితులను మెరుగుపర్చేందుకు రెండుదేశాలు చర్యలు చేపట్టామని ఒక వంక చైనా చెబుతూనే సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరిస్తున్నది. లడఖ్‌-అరుణాచల్‌ప్రదేశ్‌ మధ్య ప్రతి కీలక ప్రాంతంలోనూ ఆయుధాల కుప్పలు పోసుకుంటున్నది. భారత సైన్య గస్తీ బృందాలను అడుగడుగునా అడ్డుకుంటూ టెంపరితనం ప్రదర్శిస్తున్నది.

ఇంతకాలం ఓపికపట్టిన భారత సైన్యం పొరుగుదేశానికి గట్టిగా  జవాబిచ్చేందుకు సిద్ధమవుతున్నది. సరిహద్దుల్లో కి అదనపు బలగాలను తరలిస్తున్నది. ఉత్తరాఖండ్‌లోని జోహార్‌ లోయలో సరిహద్దు వెంట రోడ్డు నిర్మాణం వేగంపెంచేందుకు హెలికాప్టర్లలో యంత్రాలు చేరవేస్తున్నది.

నెలరోజులుగా లడఖ్‌లోని లిపులేఖ్‌ సమీపంలో భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి న చైనా సైన్యం, భారత సైన్యం గస్తీని అడ్డుకోవడంతో సరిహద్దుల్లో ఇరుసైన్యాలు ముఖాముఖి ఎదురు నిలిచి పోరాటానికి సిద్ధమయ్యాయి. గత బుధవారం జరిగిన సైనిక కమాండర్ల చర్చల్లో సైన్యాలను ఉపసంహరించాలని నిర్ణయించారు.

తూర్పు లడఖ్‌ సమస్యపై గురువారమూ చర్చలు జరిపాయి. ప్రపంచమంతా ఈ ప్రాంతంపైనే దృష్టిపెట్టగా గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దుల్లోని హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా సైన్యాన్ని పెంచుకుని కవాతు నిర్వహిస్తున్నది.

ఉత్తరాఖండ్‌లోని ఘర్‌వాల్‌, కుమావున్‌ సెక్టార్లలో చైనా సైనిక బలగాలను పెంచింది. భారీగా గుడారాలు నిర్మించి ఆయుధాలను తరలించింది. వారంరోజులుగా బారాహోతీ ప్రాంతంలోని సరిహద్దుల్లో చైనా హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఘర్‌వాల్‌ సెక్టార్లో భారీ మిలిటరీ బేస్‌ను కూడా నిర్మించింది.

దాంతో అప్రమత్తమైన భారత్‌ సరిహద్దు బలగాలకు తోడుగా తక్షణం మరికొంత సైన్యాన్ని అక్కడికి తరలిస్తున్నది. అత్యవసర సాయం కోసం వాయుసేన కూడా చిన్యాలీసోర్‌లో విమానాల ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేసింది. సిక్కింలోనూ ఇదే పరిస్థితి ఉన్నది.

అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని సరిహద్దుల్లో మే 4 నుంచే చైనా బలగాలు భారత్‌వైపు చొచ్చుకురావటం ప్రారంభించాయని తాజాగా తేలిం ది. జిన్‌జియాంగ్‌లో చైనా సైన్యం భారీ విన్యాసాలు నిర్వహిస్తున్నది. దీనినుంచి దృష్టి మళ్లించేందుకే లడఖ్‌, సిక్కింలలో భారత సైన్యంతో ఉద్దేశపూర్వక ఘర్ణణ సృష్టించినట్టు అనుమానిస్తున్నారు.

చైనా కుట్రపై కొంచం ఆలస్యంగా స్పందించిన భారత సైన్యం ఎత్తైన కొండప్రాంతాల్లో సమర్ధంగా పోరాడగల పర్వత శ్రేణి పోరాట దళాలను సరిహద్దులకు తరలించింది.