మోదీది ప్రోగ్రెస్‌ మంత్ర.. జగన్‌ది రివర్స్‌ మంత్ర  

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో అవినీతి రహిత పాలన నడుస్తుంటే, ఏపీలో అందుకు భిన్నమైన పాలన నడుస్తోందని బీజేపీ ప్రధాన కార్యదర్శి వి రాంమాధవ్‌ తీవ్ర విమర్శలు చేశారు.  ‘మోదీది ప్రోగ్రెస్‌ మంత్ర.. జగన్‌ది అంతా రివర్స్‌ మంత్ర’ అని ధ్వజమెత్తారు.

బీజేపీ ఏడాది పాలన సందర్భంగా బుధవారం విజయవాడలో జరిపిన వర్చువల్‌ ర్యాలీలో  మాట్లాడుతూ ‘వైసీపీ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. పుట్టిన రోజున కనిపిస్తే నూరేళ్లు చల్లగా ఉండవయ్యా అంటాం. అంటే ఏడాది మొత్తం చేసిన పాపాలను మర్చిపోయామని కాదు. వైసీపీ పాలన విషయంలోనూ అంతే అని స్పష్టం చేశారు. ప్రొటోకాల్‌, పాలసీ రెండూ వేర్వేరని చెబుతూ ఏపీలో రివర్స్‌ మంత్రం నడుస్తోందని విమర్శించారు

ఏపీలో అన్నీ రివర్సే అని అంటూ  రాజధాని  ప్రారంభమైన రివర్స్ జరుగుతున్నదని చెప్పుకొచ్చారు. . పోలవరం ప్రాజెక్టు టెండర్లు రివర్స్‌. ఎలక్షన్‌ కమిషన్‌లో రివర్స్‌ అని విమర్శించారు. ఏపీలో ఒకరు బెయిల్‌పై బయట ఉంటే, మరొకరు లోపలకు వెళ్లకుండా బెయిల్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక పాలనపై ఎక్కడ దృష్టి పెడతారన్నారని రాంమాధవ్‌ ప్రశ్నించారు.

అధికారంలోకి వస్తే మద్య నిషేధం అన్న వ్యక్తి ఇప్పుడు ఏపీ ప్రజలకు కొత్త కొత్త బ్రాండ్లు పరిచయం చేస్తూ దోచుకుంటున్నారని దయ్యబట్టారు. తిరుమల భూములనూ అమ్మే ప్రయత్నం చేశారని, ప్రజలు రివర్స్‌ కావడంతో వెనక్కి తగ్గారని ఎద్దేవా చేశారు.

వారానికోసారి హైకోర్టు నుంచి మొట్టికాయలు తిన్న ప్రభుత్వం దేశంలో మరొకటి లేదన్నారు. కాగా, మరో ప్రత్యామ్నాయం లేకే వైసీపీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని రాంమాధవ్‌ తెలిపారు. వైసిపి ప్రభుత్వపు అసమర్ధపు పాలన కారణంగా ఏపీలో పన్నుల ఆదాయం తగ్గినదని పేర్కొన్నారు.

లాక్ డౌన్ కారణంగా పన్నుల ఆదాయం పడిపోయినా కేంద్రం ఏపీకి ఇవ్వవలసిన పన్నుల వాటాను ఇస్తున్నదని గుర్తు చేశారు.ఏపీ అభివృద్ధి కోసం ఏమేరకైనా సహాయం చేయడానికైనా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇక్కడ ప్రభుత్వం చతికలబడినదని విచారం వ్యక్తం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కేసులో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా తప్పును సరిచేసుకుని రాజ్యాంగ వ్యవస్థలతో గౌరవంగా వ్యవహరించాలని హితవు పలికారు.

మోదీ పాలనలో దేశప్రజల్లో భరోసా, భద్రత ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను కేంద్రం అమలు చేస్తోందని, ప్రపంచ దేశాలు సైతం మోదీ పాలనను మెచ్చుకుంటున్నాయని కొనియాడారు.