టిడిపి పాలన అక్రమాలపై సీబీఐ విచారణ 

గత టీడీపీ ప్రభుత్వ  హయాంలో జరిగిన అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు తీసుకుంది. చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, ఏపీ ఫైబర్ గ్రిడ్‌లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. 

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై కేబినెట్ సబ్‌కమిటీ నివేదిక అందజేసింది. సబ్‌కమిటీ నివేదిక కేబినెట్‌ ముందు ఉంచింది. సబ్‌కమిటీ సూచన మేరకు సీబీఐ విచారణకు ఆదేశించింది.

ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయని మంత్రివర్గ ఉపసంఘం నివేదిక అందజేసింది. అర్హత లేని సంస్థలకు ప్రాజెక్ట్ కట్టబెట్టారని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. సెటాప్ బాక్సుల కొనుగోళ్లలో కూడా భారీ కుంభకోణం జరిగిందని తెలిపింది. ఫైబర్ నెట్‍లో సుమారు రూ.700 కోట్ల మేర అవినీతి జరిగిందని ఉపసంఘం నివేదికలో వెల్లడించింది. 

అలాగే సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా వంటి స్కీమ్‌ల ద్వారా రూ.158 కోట్ల అవినీతికి పాల్పడినట్లు సబ్‌కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40 కోట్లు ఖర్చు చేసినట్టుగా ఉపసంఘం నివేదికలో పేర్కొంది. హెరిటేజ్ నెయ్యి కొనుగోళ్లు, మజ్జిగ ప్యాకెట్ల సరఫరా, ఖర్చులపైనా కూడా సీబీఐ విచారణకు కేబినెట్ సిఫారసు చేసింది.  

వైఎస్సార్‌ చేయూత పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50వేల చొప్పున సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆగస్ట్‌ 12న ఈ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.

రామాయపట్నం పోర్టుకు కేంద్ర నిధులపై కూడా  చర్చించారు. కేంద్రం నిధుల కోసం ప్రయత్నిస్తూ  ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాలని తీర్మానం చేశారు. రామాయపట్నం పోర్టుకు ఆగస్టు నాటికి టెండర్లు పిలవనున్నారు. రామాయపట్నం పోర్టు టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 

10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్ నిర్మాణానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. డిస్కం, ట్రాన్స్‌కోలకు రూ.6 వేల కోట్ల ఆత్మనిర్భర్‌ భారత్‌ నిధులు ఖర్చు చేయనున్నారు. 

ఇదిలా ఉంటే ఈ నెల 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలన్నదానిపై నిర్ణయం తీసుకోనున్నారు.