తెలంగాణలో కరోనా కేసులపై కేంద్రం ఆందోళన

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడం, 4,000 మార్క్ దాటడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.  కొత్తగా 191 కరోనా కేసులు నమోదు కావడంతో ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 4,111కి చేరింది. తాజాగా కరోనాతో 8 మంది మృతి చెందగా ఇప్పటివరకూ మొత్తం 156 మంది చనిపోయారు.

జీహెచ్‌ఎంసీలో కరోనా కట్టడి చర్యలపై కేంద్రం ఆరా తీసింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతితో కేంద్ర బృందం భేటీ అయింది. కరోనా కట్టడి చర్యలపై చర్చించింది. తెలంగాణలో కరోనా కేసులు పెరగడంపై కేంద్ర బృందం ఆందోళన వ్యక్తం చేసింది. 

ఇదే విధంగా కేసులు నమోదైతే జులై 31నాటికి పరిస్థితి తీవ్రంగా మారుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులను కేంద్ర బృందం హెచ్చరించింది. ట్రీట్‌మెంట్‌, కట్టడి జోన్లలో చర్యలపై పూర్తి స్థాయిలో ఆరా తీసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాలుగు జిల్లాల అధికారులతో వాట్సాప్‌ గ్రూప్ ఏర్పాటు చేసింది.

 ప్రైవేట్‌ పరీక్షల్లో 70 శాతం పాజిటివ్‌ కేసులుగా వస్తున్నాయని, కరోనా కట్టడికి హోం కంటైన్మెంట్‌ ఒక్కటే మార్గమని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి సంజయ్‌ జాజు తెలిపారు. 

బుధవారం జీహెచ్‌ఎంసీ పరిధిలో 149 కేసులు నమోదు కాగా మేడ్చల్‌లో 11, సంగారెడ్డిలో 11, రంగారెడ్డిలో 8, మహబూబ్ నగర్‌లో 4, జగిత్యాల, మెదక్‌లో మూడేసి, నాగర్ కర్నూల్, కరీంనగర్‌లో రెండేసి, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేటలో ఒక్కో కేసు నమోదు అయింది.

ఇంకా యాక్టివ్ కేసులు 2138 ఉన్నాయి. ఇప్పటివరకూ 1,817 డిశ్చార్జి అయ్యారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు.