దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ముంబై 

జీవన వ్యయం పరంగా భారత ఆర్థిక రాజధాని ముంబై విదేశాల నుంచి వలస వచ్చిన వారికి దేశంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ఆవిర్భవించింది. ఈ విషయంలో ముంబై ప్రపంచంలో 60వ స్థానంలోనూ, ఆసియా ఖండంలో 19వ స్థానంలోనూ నిలిచినట్టు మెర్సర్‌-2020 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సర్వే వెల్లడించింది. 

భారత్‌లో ముంబై తర్వాత ఈ జాబితాలో న్యూఢిల్లీ (ప్రపంచంలో 101వ స్థానం), చెన్నై (143), బెంగళూరు (171), కోల్‌కతా (185) ఉన్నాయి. భారత్‌లో మెర్సర్‌ సర్వే చేసిన అన్ని నగరాలు ఈ జాబితాలో కనీసం నాలుగు స్థానాలు ఎగబాకాయి. అయితే న్యూఢిల్లీ మాత్రం ఏకంగా 17 ర్యాంకులు మెరుగుపర్చుకొన్నప్పటికీ ప్రపంచ టాప్‌-100 నగరాల జాబితాకు తృటిలో దూరమైంది. 

ప్రపంచ జాబితాలో హాంకాంగ్‌ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా.. ఆ తర్వాతి స్థానాల్లో అస్ఘబాట్‌ (తుర్క్‌మెనిస్థాన్‌), టోక్యో (జపాన్‌), జ్యూరిచ్‌ (స్విట్జర్లాండ్‌), సింగపూర్‌ ఉన్నాయి. గతేడాది కంటే ఈసారి సింగపూర్‌ రెండు స్థానాలు దిగజారింది. ఈ ఏడాది ప్రపంచ టాప్‌-10 నగరాల జాబితాలో న్యూయార్క్‌ (అమెరికా), షాంఘై (చైనా), బెర్న్‌, జెనీవా (స్విట్జర్లాండ్‌), బీజింగ్‌ (చైనా) వరుసగా 5 నుంచి 10 స్థానాల్లో నిలిచినట్టు మెర్సర్‌ వెల్లడించింది. 

ప్రపంచంలో జీవన వ్యయం తక్కువగా ఉన్న నగరాల జాబితాలో ట్యునిస్‌ (ట్యునీషియా), విండ్‌హోక్‌ (నమీబియా), తాష్కెంట్‌ (ఉజ్బెకిస్థాన్‌), బిష్కెక్‌ (కిర్గిస్థాన్‌), కరాచీ (పాకిస్థాన్‌) ఉన్నట్టు మెర్సర్‌ తెలిపింది.