వలసలకు ఉపాధికి కేంద్రం సమగ్ర ప్రణాళిక 

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు సొంత రాష్ర్టాల్లోనే ఉపాధి అవకాశాల్ని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ వల్ల వేలాది మంది వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు తిరిగొచ్చారు. అయితే, ఊళ్లలో ఉపాధి అవకాశాలు దొరక్క సతమతమవుతున్నారు. 

దీంతో జీవనాధారం కోల్పోయిన వలస కూలీలకు ఉపాధి, ఆర్థిక స్వావలంబన కల్పించడానికి ఓ సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నది. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ), ఆత్మ నిర్భర్‌ భారత్‌ పథకం కింద వలస కూలీలకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

దీంతోపాటు జన్‌ధన్‌ యోజన, కిసాన్‌ కల్యాణ్‌ యోజన, ఆహార భద్రతా చట్టం,ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన  వంటి సంక్షేమ పథకాల్ని కూడా అమలు చేయనున్నట్టు వివరించాయి. వలస కార్మికులు ఎక్కువగా ఉన్న బీహార్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాలలోని 116 జిల్లాలను ఇందుకోసం ఎంచుకున్నట్టు వెల్లడించాయి. 

ఇలా ఉండగా, లాక్‌డౌన్‌తో వివిధ రాష్ట్రాలలో చిక్కుకు పోయిన వలస కార్మికులను 15 రోజుల్లోగా స్వస్థలాలకు పంపాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. కార్మికుల పనిసామర్థ్యాలను ప్రత్యేకంగా అంచనా వేసి వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించాలని, అందుకోసం ప్రత్యేక ఉపాధి పథకాలను రూపొందించాలని సూచించింది. కార్మికులను తరలించేందుకు అవసరమైన మేరకు రైళ్లను 24 గంటల్లోగా రాష్ట్రాలకు అందుబాటులోకి తేవాలని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది

 వలస కార్మికులను స్వస్థలాలకు తరలించేందుకు ఈ నెల 3వ తేదీ నాటికి 4,200 శ్రామిక్‌ రైళ్లను నడిపినట్టు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇప్పటి వరకు కోటిమంది కార్మికులను సొంత రాష్ర్టాలకు తరలించామని కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది.