జగన్ ను వేధిస్తున్న మరో దళిత్ డాక్టర్ వివాదం!

మాస్క్ లు సహితం అందుబాటులో లేవని బహిరంగ ప్రదేశంలో అన్నందుకు దళితుడైన ప్రభుత్వ వైద్యుడు డా. సుధాకర్ ను సస్పెండ్ చేసి వైద్యుల నుండి, దళిత్ సంఘాల నుండి తీవ్ర నిరసనలు ఎదుర్కొన్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రస్తుతం మరో దళిత్ వైద్యురాలి వివాదం ఇరకాటంలో పడవేస్తున్నది. 

చిత్తూరు జిల్లాకు చెందిన డాక్టర్‌ అనితారాణి తనకు రెండు నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నారని, పోలీస్ లకు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆరోపణలు చేస్తున్నారు. డా. సుధాకర్ వ్యవహారంలో హైకోర్టు జోక్యం చేసుకోవడంతో ఆమె కూడా హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. 

పైగా, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితకు డాక్టర్‌ అనితారాణి తన సమస్యను ఫోన్లో వివరించడంతో ఇది రాజకీయ రంగు పులుముకొంది. వారి ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దానిని తన దీనిపై ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టారు.

దాంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి జగన్ వెంటనే ఈ ఉదంతంపై సిఐడి విచారణకు ఆదేశించారు. ఈ కేసు చేపట్టిన సిఐడి అధికారులు గత రాత్రి ఆమెను కలిసే ప్రయత్నం చేయగా ఆమె ఇంటి తలుపులు వేసుకొని సిఐడిపై తనకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. సిబిఐ మాత్రమే దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు. 

 అదీగాక, ఆమె ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరులో గల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. 

ఆసుపత్రిలో దిగువస్థాయి సిబ్బంది అవినీతిని ప్రశ్నించినందుకు తనపై కక్షకట్టారని, మార్చి 22న హాస్టల్‌ గదిలో నిర్బంధించి, స్థానిక వైసీపీ నేతలు రకరకాలుగా హింసించారని, దుర్భాషలాడుతూ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. బాత్‌రూమ్‌లోకి వెళ్లిన తనను ఫొటోలు, వీడియోలు తీశారని  ఆమె తెలిపారు. 

కాగా, ఆమె ఆరోపణలను చిత్తూరు జిల్లా డీఎంహెచ్‌వో పెంచలయ్య తీవ్రంగా తోసిపుచ్చారు. ఆమె పనిచేసిన చోటల్లా అనేక ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. సర్వీసు ప్రారంభమై 18 ఏళ్లయినా ఇంకా ప్రొబేషన్‌ డిక్లేర్‌ కాకపోవడం ఆమె పనితీరుకు నిదర్శనమని తెలిపారు.