బిసి రేజర్వేషన్లపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలి

బిసి రేజర్వేషన్లపై కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలి
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఒక్క శాతం కూడా తగ్గించకుండా తెలంగాణలో అమలు చేస్తుందా, లేదా? ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు డిమాండ్ చేశారు. జనగామలో బిజెపి కార్యకర్తల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ అది చెప్పకుండా, “గుజరాత్, యూపీలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు” అనే సాకులు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

“మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. వారికి విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ముస్లింలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుంది. ప్రస్తుతం ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్లపై కోర్టులో కేసు కూడా నడుస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు.  కాంగ్రెస్ తీసుకొచ్చే 10 శాతం ముస్లిం రిజర్వేషన్లకు మాత్రమే తాము వ్యతిరేకం అని పేర్కొంటూ అసలు మొదటి అసెంబ్లీ సమావేశంలోనే 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్ విషయాన్ని ప్రకటించాల్సిందని చెప్పారు.

19 నెలలు గడిచినా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చితీరాల్సిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ అసెంబ్లీలో పూర్తిగా మద్దతు తెలిపిందని గుర్తు చేస్తూ మరి కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు ఓబీసీల హక్కులతో చెలగాటం ఆడుతోంది? అని రాంచందర్ రావు ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు కలిసేందుకు ప్రధాని మోదీ సమయం ఇవ్వడంలేదంటున్నారని పేర్కొంటూ కానీ, అసలు ఆయనకు సమయం ఇవ్వనిది రాహుల్ గాంధీనే అంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధిని కాంక్షిస్తూ సమయం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.  ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి కేసుల్లో ఎవరినీ ఇప్పటివరకు అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకులను ఎందుకని అరెస్ట్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.  బీఆర్ఎస్ నేతలను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసులను సీబీఐ విచారణకు అప్పగించడం లేదని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, యువత, రైతులు వంటి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని రామచందర్ రావు విమర్శించారు.  రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు అన్ని సీట్లలో బీజేపీ పోటీ చేసి అధికంగా గెలుస్తుంది కూడా అని భరోసా వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల పేరుతో 420 మోసాలకు పాల్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

గ్రామీణ పేదలకు ఉచిత బియ్యం, ఇండ్లు, మరుగుదొడ్లు, గ్యాస్ కనెక్షన్లు, రూ.5 లక్షల ఉచిత వైద్యం, పొదుపు సంఘాల మహిళలకు బ్యాంకు రుణాలు, యువతకు స్వయం ఉపాధి రుణాలు..  ఇవన్నీ కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.  గ్రామాల్లో రోడ్లు, మరుగుదొడ్లు, వీధి దీపాలు, స్మశాన వాటికలు, రైతు వేదికలు, హరితహారం కింద మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అమలవుతున్నాయని స్పష్టం చేశారు.