ఫోన్ ట్యాపింగ్ కేసులో కవిత పీఏ పేరు

ఫోన్ ట్యాపింగ్ కేసులో కవిత పీఏ పేరు

తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కల్వకుంట్ల కవిత వ్యక్తిగత సహాయకుడుకు సిట్ తాజాగా నోటీసులు జారీచేసింది.  కేసు దర్యాప్తులో భాగంగా, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఫోనులో కవిత పిఏకు సంబంధించిన కొన్ని కీలక ఆడియో రికార్డింగులను అధికారులు గుర్తించినట్లు తెలుస్తున్నది.

ఈ ఆడియోల ఆధారంగా పూర్తి వివరాలు రాబట్టేందుకు మరియు కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు సిట్ బృందం కవిత పీఏను విచారణకు పిలిచింది. ఈ నోటీసుల జారీతో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరింత మంది నేతల ప్రమేయం బయటపడే అవకాశం ఉందనే ఊహాగానాలు బలపడుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, ఈ స్కామ్ లో మొత్తం 618 మంది ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ నిర్ధారించింది. 

ఇది తెలంగాణ రాజకీయ చరిత్రలోనే అతి పెద్ద ట్యాపింగ్ వ్యవహారంగా నిలిచింది. ఫోన్లు ట్యాప్ చేయబడిన బాధితుల్లో ఇప్పటికే 228 మంది వాంగ్మూలాలను అధికారులు నమోదు చేశారు. వీరిలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా, పలువురు వీఐపీల నుంచి కూడా ఈ కేసులో కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

ప్రధాన నిందితుడు ప్రణీత్ రావును లోతుగా విచారించినప్పుడు, ఆయన నుంచి సేకరించిన సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా, ఇతర పత్రాల ఆధారంగా దర్యాప్తు పరిధిని సిట్ మరింత విస్తరించింది.  ఈ ఆధారాల్లోనే కవిత పీఏకు సంబంధించిన ఆడియో రికార్డింగ్‌లు బయటపడటంతో, కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ రికార్డింగ్‌లలో ఉన్న సంభాషణల సారాంశం, వాటి ఉద్దేశ్యం ఏమిటి అనేది విచారణ అనంతరం స్పష్టమయ్యే అవకాశం ఉంది.
కవిత పీఏకు సిట్ నోటీసులు జారీ చేయడం, విచారణకు పిలవడం వంటి పరిణామాలతో బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు బీఆర్ఎస్ నాయకుల పేర్లు వినిపిస్తుండగా, ఇప్పుడు కవిత పీఏకు నోటీసులు ఇవ్వడం ద్వారా మరికొందరు పార్టీ నేతలకు సైతం సిట్ అధికారులు నోటీసులు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మొత్తం వ్యవహారం బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర ఇబ్బందులను సృష్టిస్తోంది. 

సిట్ విచారణలో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో, ఎవరెవరు ఈ ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో ప్రమేయం కలిగి ఉన్నారోనని రాజకీయ వర్గాల్లో విస్తృతమైన, ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.