పరారీలో ఉన్న హర్యానా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చోకర్ను ఈడి అరెస్ట్ చేసినట్లు అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి. సుమారు రూ. 1500 కోట్ల మనీల్యాండరింగ్ కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ఓ హోటల్ నుంచి అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు.
హర్యానాలోని సమల్కా ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే ధరమ్ సింగ్ రాజకీయాల్లో పేరుగాంచిన వ్యక్తి. ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎన్నికయ్యారు. ఇదే స్కామ్తో లింకున్న వ్యక్తులను ఈడీ అరెస్టు చేసింది. ధరమ్ సింగ్ కుమారుడు సికందర్ చొకర్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
షెల్ కంపెనీలకు మనీల్యాండరింగ్ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్తో పాటు ఇతర రంగాల్లో చోటుచేసుకున్న ఆర్థిక అక్రమాల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టారు. 2023లో గురుగ్రామ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. ఎమ్మెల్యే ధరమ్ చోకర్ అతని కుమారులు ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.
చోకర్ను గతేడాది ఈడి అరెస్ట్ చేసింది. బెయిల్పై విడుదలైన ఆయన పరారాలో ఉన్నారు. చోకర్, ఆయన కుమారులు వికాస్ చోకర్ (పరారీలో ఉన్నారు), సికిందర్ చోకర్లు 1500 మందికి పైగా గృహవినియోగదారులను మోసం చేసి, వారి నుండి రూ.500 కోట్లకు పైగా నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) కింద కోర్టు చోకర్ మరియు వికాస్ చోకర్లకు పలు నాన్బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. మే 19న కోర్టు ఎదుట హాజరుకావాలని కూడా ఆదేశించింది. గురుగ్రామ్లో సెక్టార్ 68లో ఇండ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. 2021-22 నాటికి ఇండ్లను కట్టిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ కమిట్మెంట్కు కట్టుబడి లేరు. మహిర గ్రూపునకు వ్యతిరేకంగా ధర్నాలు, ఆందోళనలు జరిగాయి.
కంపెనీ డైరెక్టర్లు డబ్బును అక్రమంగా తరలించినట్లు ఈడీ ఆరోపించింది. నిర్మాణ ఖర్చులకు చెందిన నకిలీ పత్రాలు చూపించారు. ఫేక్ బిల్లులు, ఇన్వాయిస్లు చూపించి మహిరా డైరెక్టర్లు ఆ డబ్బును వ్యక్తిగత అవసరాలకు వాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మహిర గ్రూపునకు చెందిన వాహనాలు, నగదు, బంగారం, నగలను 2023 జూలైలో సీజ్ చేశారు. 2009లో తొలిసారి హర్యానా జనహిత్ కాంగ్రెస్ టికెట్పై పోటీ చేసి గెలిచారు. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారాయన. 2014లో ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. మళ్లీ 2019లో సమల్కా నుంచి ఆయన గెలిచారు. అయితే, గతఏడాది ఓటమిపాలయ్యారు.

More Stories
భారత్లో తొలిసారి పట్టుబడిన ‘జీహాదీ’ డ్రగ్
వెండి, బంగారం దిగుమతులపై కేంద్రం ఆంక్షలు
ఇరాన్తో ఉద్రిక్తతలతో పెను సంక్షోభం దిశగా అమెరికా