
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు త్వరలో చార్జీలు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. మెట్రో సేవలను నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ సంస్థ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్టు సమాచారం. కరోనా సమయంలో ప్రయాణికుల రాకపోకలు తగ్గిపోవడం వల్ల వచ్చిన నష్టాలు ఇంకా తేరుకోకపోవడంతో, దాదాపు రూ. 6,500 కోట్ల నష్టం వాటిల్లినట్టు కంపెనీ వెల్లడించింది.
కరోనా సమయంలోనే మెట్రో ఛార్జీలను పెంచాలని మెట్రో రైలు నిర్వహణ సంస్థ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అసలే ప్రజలు కరోనా కష్టాలలో ఉంటే మెట్రో రైలు చార్జీలు పెంపు చేయడం మంచిది కాదనే అభిప్రాయంతో సంస్థ అభ్యర్థనకు సుముఖత వ్యక్తం చేయలేదు. దానితో మెట్రో ఛార్జీల పెంపు దీంతో చార్జీల పెంపు నిర్ణయం వాయిదా పడింది.
ఇక తాజా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఎల్ అండ్ టి సంస్థ ఇప్పుడు చార్జీల పెంపు తప్పనిసరి అని గట్టిగా భావిస్తోంది. ఇప్పటికే బెంగళూరు మెట్రో ఛార్జీలను 44 శాతం పెంచిన నేపథ్యంలో, హైదరాబాద్లో కూడా ఇదే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఈ నిర్ణయానికి పునాది వేస్తూ, సంస్థ ఇటీవల రూ. 59 హాలిడే సేవర్ కార్డు, పీక్ అవర్స్ డిస్కౌంట్లను సైలెంట్గా రద్దు చేసింది.
వీటిని చూసిన ప్రయాణికులు త్వరలో ఛార్జీలు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. నగర వాసులు పెద్ద సంఖ్యలో మెట్రో సేవలను నమ్ముకుని ప్రయాణిస్తున్న నేపథ్యంలో, ఛార్జీల పెంపు నిర్ణయం వారికి గణనీయమైన ఆర్థిక భారం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, నష్టాల భారం చూసినట్లయితే, ఛార్జీల పెంపు అనివార్యమేనని భావిస్తున్నారు.
ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ దీనిపై త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశముంది. ఈ నిర్ణయం మెట్రో ప్రయాణికుల జీవనశైలిపై ప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు