రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ ను ప్రశ్నించిన పోలీసులు

రెండున్నర గంటల పాటు అల్లు అర్జున్ ను ప్రశ్నించిన పోలీసులు
 
పుష్ప-2 రిలీజ్ సందర్భంగా ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వ‌ద్ద జ‌రిగిన‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో విచార‌ణ‌కు హాజ‌రయ్యారు. మంగ‌ళ‌వారం ఉదయం 11 గంటలకు చిక్కడపల్ల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు అల్లు అర్జున్ హాజ‌రుకాగా దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు అత‌డిని పోలీసులు విచారించారు. 
 
విచార‌ణ అనంతరం అల్లు అర్జున్ జూబ్లీహిల్స్‌లోని త‌న నివాసానికి చేరుకున్నారు.  ఈ కేసుకు సంబంధించి పోలీసులు సోమవారం నోటీసులివ్వగా, లీగల్‌ టీంతో చర్చించిన అనంతరం విచారణ కోసం మంగళవారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ మామ చంద్రశేఖర్‌ రెడ్డి, నిర్మాత బన్నీ వాసు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. 
 
న్యాయవాదులతో కలిసి హాజరైన అల్లు అర్జున్‌ను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ విచారించారు. ఏసీపీ రమేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజునాయక్‌ సమక్షంలో విచారణ జరిగింది.  సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు ఇప్పటికే ఓ వీడియో విడుదల చేశారు. ఈ వీడియో ఆధారంగా అల్లు అర్జున్​ను ప్రశ్నలు అడుగుతున్నట్లు సమాచారం. 
 
బెయిల్​పై బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్‌లో ప్రస్తావించిన అంశాలపైనా ఆరా తీసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ విచారణ దృష్ట్యా చిక్కడపల్లి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్‌లో ప్రీమియర్‌ షో జరిగిన రోజు పరిణామాల ఆధారంగా పోలీసులు ప్రశ్నించారు. 
సీసీ టీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా థియేటర్‌ ఎంట్రీ, ఎగ్జిట్‌ ద్వారాల వద్ద ఉన్న సాక్ష్యుల నుంచి వివరాలు సేకరించారు. దీని ఆధారంగా అల్లు అర్జున్‌ను ప్రశ్నించినట్లు సమాచారం.
సంధ్య థియేటర్‌ సీనియర్‌ మేనేజర్‌ నాగరాజును ఇప్పటికే రెండురోజుల పాటు కస్టడీలోకి తీసుకుని పోలీసులు వివరాలు రాబట్టారు.  పుష్ప-2 ప్రీమియర్‌ షోకు అల్లు అర్జున్ సహా ఇతర నటీనటుల రాకకు సంబంధించిన అనుమతిని పోలీసులు తిరస్కరించినట్లు నాగరాజు అంగీకరించారు. అయితే ఈ విషయాన్ని నాగరాజు చెప్పారా ? లేదా అనే విషయంపైనా అల్లు అర్జున్‌ను నుంచి స్పష్టత తీసుకున్నట్లు తెలుస్తోంది.
థియేటర్‌ యజమాన్యం నుంచి మీకు సమాచారం అందిందా? అందినప్పటికీ మీరు ప్రిమియర్‌షోకు వచ్చారా? అనే విషయంపైనా ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.  థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన సమయంలో అల్లు అర్జున్‌ బౌన్సర్లు వ్యవహిరించిన తీరును పోలీసులు తీవ్రంగా పరిగణించారు. వ్యక్తిగత సిబ్బంది అభిమానులు తోసివేయడంతోనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆంటోని అనే బౌన్సర్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. 

నిబంధనల మేరకు బౌన్సర్లను నియమించుకున్నారా? లేదా అనే అంశంపైనా అల్లు అర్జున్‌ నుంచి వివరాలు రాబట్టారు. ఈ కేసులో మరికొంత మందికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ నిర్వహించాలని భావిస్తున్నారు. విచారణలో అల్లు అర్జున్‌ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. మొత్తం విచారణను వీడియో రికార్డింగ్ చేశారు. దాదాపు 20కిపైగా ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు బన్ని సమాధానాలు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం.